YSRCP Plenary 2022: ప్లీనరీకి పటిష్ట భద్రత

Strong security for YSRCP Plenary 2022 Andhra Pradesh - Sakshi

3,500 మందితో బందోబస్తు

14 మంది ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణ

30 మంది డీఎస్పీలు, 120 మంది సీఐలు, 170 మంది ఎస్సైలకు విధులు

అందుబాటులో రిజర్వ్‌ ఫోర్స్‌

వీఐపీలకు పాస్‌లు.. అవి ఉన్న వారికే అనుమతి.. అనుచరులకు అనుమతి లేదు

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు

అనుమానితుల కదలికలపై గట్టి నిఘా

వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. ట్రాఫిక్‌ మళ్లింపు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. విజయవాడ – గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్లీనరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తలు అంచనాలకు మించి రానున్నారు.

అందుకు తగ్గట్టుగానే పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్‌ అయ్యన్నార్, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, విజయవా డ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, గుంటూ రు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ అంశాలపై ప్రణాళిక రూపొందిం చారు.

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్లీనరీ ప్రాంగణాన్ని గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 3,500 మంది పోలీసులను ప్లీనరీ భద్రతా విధుల కోసం నియమించారు. 14 మంది ఐపీఎస్‌ అధి కారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుం డా 30 మంది డీఎస్పీలు, 120 మంది సీఐలు, 170 మంది ఎస్సైలకు విధులు కేటాయించారు. రిజర్వ్‌ ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. సీఎం హెలికాప్టర్‌ కోసం ప్లీనరీ వేదికకు సమీపంలో హెలి ప్యాడ్‌ ఏర్పాటు చేశారు.  
సర్వం సిద్ధం.. 

వీఐపీలకు ప్రత్యేక ప్రవేశ ద్వారం
ప్లీనరీకి హాజరయ్యే వీఐపీల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర కేబి నెట్‌ హోదా కలిగిన ప్రముఖులు దాదాపు 300 మం ది వీఐపీ జాబితాలో ఉన్నారు. వారికి వీఐపీ పాస్‌ లు, వాహన పాస్‌లు జారీ చేశారు. వారికి ప్రత్యేక రూట్‌ను నిర్ణయించారు.

నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఏఎన్‌యూ డైవర్షన్‌ పాయింట్‌ నుంచి అండర్‌పాస్‌లో వచ్చి వేదిక వద్దకు  చేరుకోవాలి.  కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రధాన వేదిక ముందు ‘డి జోన్‌’ను ఏర్పాటు చేశారు.ఆ జోన్‌’లోకి ఎవరినీ అనుమతించరు. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలను గుర్తించేందుకు నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
గురువారం రాత్రి విద్యుత్‌ దీపాల ధగధగలతో కాంతులీనుతున్న ప్లీనరీ ప్రాంగణం 

పక్కాగా పార్కింగ్‌ ఏర్పాట్లు
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.  
► సీఎం కాన్వాయ్‌ వాహనాల పార్కింగ్‌:  జేఎంజే స్కూల్‌ పార్కింగ్, సెయింట్‌ ఆన్స్‌ కాంపౌండ్‌. 
► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్ల వాహనాలకు: బైబిల్‌ మిషన్‌ భవంతి పశ్చిమ వైపున ఉన్న ప్రదేశం.
► విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులకు: కాజా టోల్‌ గేట్‌ వద్ద ఉన్న ఆర్కే వెనుజియ లే అవుట్‌ వద్ద
► విజయవాడ నుంచి వచ్చే కార్లు, ఆటోలు, బైక్‌లు, స్కూటర్లకు : ఏఎన్‌యూ నార్త్,  మెయిన్‌ గేటు, సౌత్‌ గేట్ల వద్ద పార్కింగ్, అయోధ్య రామిరెడ్డి – సన్స్‌ ఫంక్షన్‌ హాల్‌ ప్రదేశం
► గుంటూరు వైపు  నుంచి వచ్చే బస్సులకు : నంబూరు, కంతేరు రోడ్డు పక్కన
► గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు: అమలోద్భవి హోటల్‌ ప్రాంగణం, జైన్‌ ఆలయం ప్రాంగణం, దశావతార ఆలయం ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్‌ ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్‌ వెనుక, కంతేరు రోడ్డు రైల్వే గేటు నుంచి సాయి భారతి హోం వరకు,  రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్, కంతేరు రోడ్డులో వైట్‌ ఫెన్సింగ్‌ ఖాళీ ప్రదేశం, ఎడ్ల పందేల ర్యాంప్, పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు వరకు, ఖలీల్‌ దాబా వెనుక వైపు, రెయిన్‌ ట్రీ అపార్ట్‌మెంట్‌ సమీపంలో.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీజీపీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారీస్థాయిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హాజరయ్యే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో  మొత్తం 3,500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలకు అనుమతించిన వాహనాల్లో వారు మాత్రమే రావాలి. వారి అనుచరులు, కార్యకర్తలను అనుమతించరు. పోలీసులకు నేతలతో సహా అందరూ సహకరించాలి.

జాతీయ రహదారి ట్రాఫిక్‌ మళ్లింపు
ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలుంటాయి. 
► చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే భారీ రవాణా వాహనాలను ఒంగోలు జిల్లా  త్రోవగుంట వద్ద మళ్లిస్తారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ చేరుకోవాలి. అక్కడ నుంచి  ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు.
► చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి  మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి.
► చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం  వెళ్లే వాహనాలను పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు , చందోలు, చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ మీదుగా  హనుమాన్‌ జంక్షన్‌ చేరుకోవాలి.
► చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్‌ వద్ద మళ్లిస్తారు. ఉన్నం, ఏబీ పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు , చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ చేరుకోవాలి.
► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్‌ వద్ద మళ్లిస్తారు. తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ చేరుకోవాలి.
► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా ఒంగోలు చేరుకోవాలి. 
► గుంటూరు వైపు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు తాడికొండ, తుళ్ళూరు, వెంకటపాలెం, యెర్రబాలెం, డాన్‌ బాస్కో స్కూల్, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి పెట్రోల్‌ బంక్, వారధి మీదుగా విజయవాడ చేరుకోవాలి. 
► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు దివాన్‌ చెరువు, ధవళేశ్వరం వంతెన, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వెళ్లాలి.
► విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. ఇవి నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి.
► గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు కేసరపల్లి, ముస్తాబాద,  ఇన్నర్‌ రింగ్‌ రోడ్, పైపులరోడ్‌ మీదుగా ఇబ్రíహీంపట్నం చేరుకోవాలి.
► హనుమాన్‌ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి.
► భారీ సరకు రవాణా వాహనాలు గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. è హైదరాబాద్‌ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై  వెళ్లాలి. 
► హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు,  మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ చేరుకోవాలి.

మల్టీ యాక్సిల్‌ రవాణా వాహనాల నిలిపివేత
చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే మల్టీ యాక్సిల్‌ రవాణా వాహనాలను చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేస్తారు. శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్‌ రవాణా వాహనాలను హనుమాన్‌ జంక్షన్, పొట్టిపాడు టోల్‌ గేట్‌ వద్ద నిలిపివేసి, శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top