
స్నేహితుడి హత్య
ఐదుగురి అరెస్టు
పరారీలో ఇద్దరు
కోరుకొండ: తాగిన మత్తులో కొంతమంది వ్యక్తులు స్నేహితుడినే అంతమొందించారు. ఈనెల 4న జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ కథనం మేరకు... కోరుకొండ మండలం గాడాల–నిడిగట్ల రోడ్డులోని ఓ వెంచర్ డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హతుడిని రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం గ్రామానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు (31)గా పోలీసులు గుర్తించారు.
చిన్నబ్బులుకు రాజమహేంద్రవరానికి చెందిన డీజే సాయి, శెట్టి వీరబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్సాయి, ఆకుల గణేశ్ స్నేహితులు. తరచుగా కలుసుకుని మద్యం తాగుతుంటారు. ఈనెల 4న ఉదయం మద్యం తాగుతున్న సమయంలో వీరబాబు సెల్ఫోన్ చిన్నబ్బులు తీసుకోగా, కింద పడి పగిలిపోయింది. దీంతో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు బెదిరించుకున్నారు. సమస్య పరిష్కరించుకుందామని అదే రోజు రాత్రి చిన్నబ్బులును పిలిచారు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఐదుగురూ చిన్నబ్బులు గొంతును పదునైన బ్లేడ్తో కోసి, బండరాయితో మోది హత్య చేశారు. నిందితులను పోలీసులు రాజమహేంద్రవరం సీతంపేటలోని ఓ ఇంట్లో అరెస్టు చేశారు. వారికి ఆశ్రయమిచి్చన గండిమేను సుదర్శన్, నిఖితలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు, ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నారు.
తండ్రి హతం
మద్యం తాగి ఇంట్లో గొడవ.. కొడుకులపై దాడి
ఎదురు దాడి చేసిన పెద్ద కుమారుడు
తోట్లవల్లూరు: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో కొడుకు చేతిలో తండ్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని చాగంటిపాడు గ్రామానికి చెందిన నిమ్మకూరి ఆనంద్ (43) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య సుపధ, కుమారులు వాసు, భార్గవ్ ఉన్నారు. వాసు కార్ల షోరూమ్లో పనిచేస్తున్నాడు. భార్గవ్ డిగ్రీ చదువుకుంటూ విజయవాడలో ఉంటున్నాడు. తనకు తెలియకుండా భార్య ఇంటిపై రూ.5లక్షలు అప్పు తెచ్చినట్టు ఆనంద్కు తెలిసింది.
ఈక్రమంలో సోమవారం మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆనంద్ తల్లి వెంకటేశ్వరమ్మ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి మద్యం తాగి వచ్చి గొడవచేస్తున్న విషయాన్ని సుపధ కొడుకులు చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న కొడుకులతో కూడా ఆనంద్ గొడవకు దిగాడు. రాడ్తో పెద్ద కొడుకు వాసుపై దాడి చేయటంతో కింద పడిపోయాడు. వెంటనే వాసు చేతికి దొరికిన చెక్కతో దాడి చేశాడు.
కోపంలో రాడ్తో కూడా కొట్టడంతో తలకు బలమైన గాయాలై ఆనంద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ అవినాశ్ మంగళవారం వివరాలను సేకరించారు. మృతుని తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకుడైన వాసుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
యువకుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిస కావడంతో, భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని జాకీర్హుస్సేన్ నగర్లో మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రబ్బాని (30), మముల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రబ్బాని తన ఇంటి పక్క వీధిలో టిఫిన్ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
మద్యానికి బానిసైన రబ్బాని భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో దంపతుల నడుమ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్తపై అలిగి మముల తన ఇద్దరు పిల్లలను తీనుకుని శ్రీనివాసగనర్లోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రబ్బాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ ఇక్బాల్ ఫోన్ చేసి మములాకు తెలిపారు.
దీంతో ఆమె తన బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు.