పిడుగుపాటుకు ఆరుగురు మృతి | Six struck dead by lightning: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఆరుగురు మృతి

May 5 2025 4:48 AM | Updated on May 5 2025 4:54 AM

Six struck dead by lightning: Andhra pradesh

కృష్ణా జిల్లా ఈడుపుగల్లు హైస్కూల్‌ వద్ద కారు పై కూలిన భారీ వృక్షాలు

ఈదురుగాలుల బీభత్సం

చెట్టు విరిగి ఇంటిపై పడటంతో బాలుడు మృతి

గొర్రెల కాపరికి గాయాలు

కూలిన చెట్లు, ఎగిరిన రేకుల షెడ్లు

సాక్షి నెట్‌వర్క్‌: కుండపోత వర్షానికి తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో ఈదురు గాలుల ధాటికి చెట్టు విరిగి రేకుల ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న పన్నెండేళ్ల బాలుడు మామిళ్ల బాలగోవింద్‌ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కృష్టా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాతంగి సుప్రదీప్‌ (22) బాపట్ల జిల్లా గాజుల్లంక వెళ్తుండగా పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. స్నేహితుడైన పాగోలు అనిల్‌కుమార్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సుప్రదీప్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. అనిల్‌ కుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరోవైపు చినగంజాం మండలం సోపిరాలలోని రామకోటేశ్వర కాలనీకి చెందిన గడ్డం బ్రహ్మయ్య గొర్రెలు మేపేందుకు పొలం వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బాపట్ల జిల్లా కొల్లూరు సమీపంలోని పొలాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోయలకొండ మండలానికి చెందిన అంజి అనే గొర్రెల కాపరి పిడుగు పడి గాయపడ్డాడు. తన మొబైల్‌ ఫోన్‌కు పవర్‌బ్యాంక్‌తో చార్జింగ్‌ పెట్టి బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అతి సమీపంలో పిడుగు పడింది.

చెవులు, ముక్కు నుంచి రక్తం రావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరుపతి జిల్లా రాపూరు మండలం, రావిగుంటపల్లికి చెందిన తాటిబోయిన చిన్నయ్య (35), ఓజిలి మండలం గొల్లపాళెంకు చెందిన మారుబోయిన కార్తీక్‌ (10), నాయుడుపేట మండలం వద్దిగుంటకండ్రిగకు చెందిన రైతు భాస్కర్‌ (53) పిడుగుపాటుకు మృతిచెందారు.అలాగే, తిరుపతి జిల్లా చిల్లకూరి మండలం కాకులపాలెం వద్ద పిడుగుపడి బాతుల కాపరి ముణీంద్ర(40) మృతి చెందాడు.    చిల్లకూరు మండలం వడ్డికండ్రిగలో ఆవుదూడ సైతం మృతిచెందింది. గూడూరు మండలం, చెన్నూరు పంచాయతీలో పిడుగు పడి  శ్రీనివాసులకు చెందిన  పాడి గేదె మృతి చెందింది. తిరుపతి అర్బన్‌ మండలం మంగళం పరిధిలోని బొమ్మల క్వార్టర్స్‌లో కె.లలితకు చెందిన భారీ షెడ్డు కూలిపోయింది. షెడ్డు లోపల తయారీలో ఉన్న 40 పెద్ద వినాయక విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

కూలిన చెట్లు, ఎగిరిన ఇంటి పైకప్పులు
తిరుపతిలోని శివజ్యోతి నగర్, హరేకృష్ణ రోడ్, మహిళా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, తిమ్మనాయుడుపాలెం, కపిల తీర్థం ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. 15 నిమిషాల పాటు వడగండ్ల వాన పడింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలో 14.87 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విస్సన్నపేట మండలంలో 54.4 మిల్లీవీుటర్లు వర్షం కురిసింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత జాతీయ రహదారి వెంబడి స్పెన్సర్‌ దగ్గర నుండి ఉండవల్లి సెంటర్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి రాకపోకలకు ఇబ్బంది కలిగింది.

నులకపేట తెల్ల క్వారీ, మదరసా, ఎర్ర క్వారీ ప్రాంతాల్లో చెట్లు విరిగి ఇళ్లపై పడి రేకులు పగిలిపోగా, మరికొన్ని నివాసాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. ఉండవల్లి దళితవాడకు వెళ్లే దారిలో ఓ ఇంటి పైకప్పు గాలిలోకి ఎగిరి గోడలు కూలాయి. ఉండవల్లిలోని పుష్కరాల కాలనీలో ఇంటి పైకప్పులు పైకి ఎగిరిపోయాయి. వడ్డెర కాలనీలో ఇళ్లపై చెట్లుపడి రేకులు పగిలిపోయాయి. సీతానగరంలో రెండుచోట్ల ఇంటి పైకప్పు గాలిలోకి ఎగిరాయి. తాడేపల్లిలో 25 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉండవల్లిలో 6 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ జారిపడింది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో భీకరమైన శబ్దాలతో ఉరుములు, పిడుగులు, పెనుగాలులు, భారీ వర్షం కురిసింది. తూపిలిపాళెం సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వర్షం ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షలు రాసేందుకు బెజవాడ వచ్చిన అభ్యర్థులు అవస్థలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement