
సాక్షి, అమరావతి: ఒకవైపు ఉచిత ఇసుక అంటూనే... మరోవైపు రకరకాల చార్జీలను ప్రజలపై మోపుతోంది టీడీపీ ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానంలో రవాణా చార్జీలు రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా జీవో జారీ చేసింది. కిలో మీటర్ల ప్రకారం ఆరు శ్లాబులుగా రవాణా చార్జీలను నిర్ణయించింది. ఇసుక సరఫరా పాయింట్ నుంచి వినియోగదారునికి చేరే వరకు ఉన్న దూరాన్ని బట్టి శ్లాబు ఉంటుంది. ఈ శ్లాబుల ప్రకారం వాహనాల్లోని ఇసుక పరిమాణం, కిలోమీటర్ల దూరాన్ని లెక్కించి రవాణా చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది.
ఈ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని ఒప్పందం చేసుకుని ఇసుక రవాణా చేసే వాహనాల యజమానులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూనే ఇలా రవాణా చార్జీలను ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తవ్వకం, లోడింగ్ చార్జీలను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఇక అది ఇసుక విధానం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.