Juttada case : విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష | Sensational verdict of Visakhapatnam court | Sakshi
Sakshi News home page

Juttada case : విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష

Jun 27 2025 6:12 PM | Updated on Jun 27 2025 7:31 PM

Sensational verdict of Visakhapatnam court

సాక్షి: విశాఖ:  2021లో ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  

2021 ఏప్రిల్ 15న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో (Juttada case) జరిగిన ఈ హత్యాకాండ నాడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడు బత్తిన అప్పలరాజు.. బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టడానికి బమ్మిడి రమణ కుమారుడు విజయ్‌ కిరణ్ కారణమేనని పోలీసులు నిర్ధారించారు.

కుమార్తెను లైంగికంగా వేధించిన విజయ్‌ కిరణ్‌ 
కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. జుత్తాడ గ్రామంలో బత్తిన అప్పలరాజు.. బమ్మిడి రమణ ఇరుగు పొరుగు కుటుంబాలే.  అయితే, బత్తిన అప్పలరాజు కుమార్తెను బమ్మిడి రమణ కుమారుడు విజయ్‌ కిరణ్‌ ప్రేమించాడు. ఇదే విషయంపై అప్పలరాజు .. బమ్మిడి రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో తన కుమార్తెపై విజయ్ కిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెను మోసం చేసి, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడంటూ అప్పలరాజు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

ఈ క్రమంలో తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, ఊళ్లో తన పరువు పోవడానికి బమ్మిడి రమణ కుటుంబమేనని నిందితుడు అప్పల రాజు భావించాడు. ఎలాగైనా రమణ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని కుట్రకు పాల్పడ్డాడు. 

నరమేధానికి పాల్పడ్డ అప్పలరాజు
మరోవైపు విజయ్‌.. ఉషారాణిని వివాహం చేసుకుని విజయవాడలో సెటిల్‌ అయ్యాడు. విజయ్‌ మేనత్త నక్కెళ్ల అరుణ బంధువు కుమారుడు సాయి వివాహం ఏప్రిల్‌   17న,2021లో శివాజీపాలెంలో జరగనుంది. పెళ్లి కబురు చెప్పేందుకు శివాజీపాలెం నుంచి బుధవారం (ఏప్రిల్‌ 14) ఉదయం అరుణ జుత్తాడకు చేరుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్‌ కిరణ్‌ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, తల్లి రమాదేవితో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుంది. విజయ్‌ మాత్రం తన పెద్ద కుమారుడు అఖిల్‌తో విజయవాడలోనే ఉండిపోయాడు. తన ఇంటికి వెళ్తున్న సమయంలో అప్పలరాజు తారసపడగా.. విజయ్‌ భార్య నవ్వుతూ పలకరించిందని సమీప బంధువులు చెబుతున్నారు. అప్పటికే కక్ష పెంచుకున్న అప్పలరాజు వారి రాకతో మరింత రగిలిపోయి.. ఈ నరమేధానికి పాల్పడ్డాడు. 

ఏం జరుగుతుందో ఊహించేలోపే 
సరిగ్గా ఏప్రిల్‌ 15 ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్‌ అత్త అల్లు రమాదేవి (63)పై అక్కడే మాటువేసి ఉన్న అప్పలరాజు ఒక్క ఉదుటున వచ్చి ఈత కల్లు కత్తితో దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి కోలుకోకముందే మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. చేతిని నరికేసి.. ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్‌ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్‌(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య చేశాడు. పిల్లలిద్దరి మెడపై బలంగా కత్తితో వేటేశాడు. ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా నరికి పేగులు బయటికి తీసేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన విజయ్‌ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్‌రూమ్‌లో ఉన్న విజయ్‌ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్‌రూమ్‌ డోర్‌ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్‌ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది.

విశాఖలో ఆరుగురిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు

చంపేశా.. తీసుకెళ్లండి..
కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్‌ చేశాడు. ‘జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశాను. నేను ఇక్కడే ఉన్నాను. లొంగిపోతాను’ అంటూ తాను చేసిన నరమేధం గురించి చెప్పగా.. అక్కడి నుంచి పెందుర్తి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.  తాజాగా,ఇదే కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. అమానుషంగా ఆరుగురి ప్రాణాలు తీసిన నిందితుడు బత్తిన అప్పల రాజుకు ఉరిశిక్షను ఖరారు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement