సాక్షి,కృష్ణా: విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా రవాణా చేస్తున్న 46 జిలెటిన్ స్టిక్స్,50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీ నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించి వచ్చాడు. అయితే బస్సు దిగిన తర్వాత తన బ్యాగ్కు బదులుగా పొరపాటున వేరొకరి బ్యాగ్ను ఓపెన్ చేశాడు. ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో జిలెటిన్ స్టిక్స్ ఉండటాన్ని గుర్తించి ఆసిఫ్ అలీ ఖంగుతిన్నాడు. వెంటనే అప్రమత్తమై బస్ స్టాండ్ అవుట్పోస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన కృష్ణలంక పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక ఎస్సై గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను ఆరా తీయడంతో పాటు, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ బ్యాగ్ ఎవరిది? నరసరావుపేట నుంచి విజయవాడకు వాటిని ఎందుకు తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.


