సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీరింగ్ అంటే కేవలం భవనాలు, రహదారులు, వంతెనలు నిర్మించడం మాత్రమే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారాయన.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభను స్ఫూర్తిగా పేర్కొంటూ.. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్రను గుర్తు చేశారు. ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి, ఆవిష్కరణలకే పరిమితం కాకుండా.. సమాజ పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కీలకంగా నిలుస్తోందని జగన్ పేర్కొన్నారు.
‘‘ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం’’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభతో భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. దేశ మౌలిక వసతుల అభివృద్ధి నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని జగన్ అన్నారు. దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ప్రతి ఇంజనీర్కు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.… pic.twitter.com/7X4XOlDVbT
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2026
మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ రంగంలో విశేష సేవలందించారు. నీటి పారుదల, జలవనరుల నిర్వహణ, వరద నియంత్రణ వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి విశేష గుర్తింపు పొందింది. మైసూరు దివాన్గా పనిచేసిన సమయంలో పారిశ్రామిక, విద్యా, ఆర్థిక రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఏటా ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఈ డీఎస్సీ వార్ ఆగదు


