
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సంతోషాన్ని నింపుతోందని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పీఆర్సీ కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించటం, ఐఆర్ రికవరీ నిబంధన తొలగింపు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, మంత్రుల కమిటీకి అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో అసోసియేషన్ సమావేశం జరిగింది.
అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ రమణ మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతమేరకు చేయాలో అంతవరకూ చేసిందన్నారు. బంద్లు, సమ్మెలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది బడుగు, బలహీన వర్గాలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్ముతున్నామన్నారు. అవకాశం ఉన్నంత మేరకు ఉద్యోగులకు భవిష్యత్లో కూడా మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రుల కమిటీ చెప్పిన మాటను విశ్వసిస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునిల్కుమార్ మాట్లాడుతూ.. 23 శాతం ఫిట్మెంట్ను తమ అసోసియేషన్ స్వాగతిస్తోందన్నారు. అమరావతి ఏరియా అధ్యక్షుడు సుధాకర్, కృష్ణా జిల్లా కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షుడు శశిభూషణ్, అసోసియేషన్ నేతలు ఎం.రాఘవులు, యు.నవీన్, డాక్టర్ నాగరాజు, కె.రమణ, కొత్తపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.