పోలవరం కాలువ గట్టును చెరబట్టిన పచ్చ నేతలు
నిత్యం 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమ రవాణా
రోజుకి రూ.10 లక్షలకు పైగా ఆదాయం
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం
పచ్చ నేతల కాసుల కక్కుర్తికి పోలవరం కుడికాలువ గట్టు కనుమరుగవుతోంది. దర్జాగా క్వారీలను ఏర్పాటు చేసి
రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కాలువ గట్టును కొల్లగొట్టి మట్టిని అమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని పలు ప్రాంతాలకు రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని బెదిరిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న ఈ మట్టి క్వారీ తవ్వకాలపై సాక్షి ప్రత్యేక కథనం.
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా గుణ్ణంపల్లిలోని పోలవరం కుడి కాలువకు రెండు పక్కల గట్లపై టీడీపీ నాయకులు మట్టి క్వారీలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా దర్జాగా తవ్వకాలు జరుపుతు న్నారు. కాలువ ఎడమ గట్టుపై రాత్రీ, పగలు, కుడి గట్టుపై కేవలం రాత్రి వేళల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.
రోజుకి 100 నుంచి 150 టిప్పర్ల మట్టి భీమడోలు, గుండుగొలను, ఆగడాల లంక, పోతునూరు, ఏలూరు, దూబచర్ల, కైకరం, భీమవరం తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు మెరక చేయడానికి, చేపలు, రొయ్యల చెరువుల గట్లకు, ద్వారకాతిరుమల మండలంలోని ఓ పరిశ్రమకు, ఇతర పనులకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు. దూరాన్ని బట్టి టిప్పర్ మట్టిని రూ. 10 నుంచి 12 వేలకు విక్రయిస్తున్నారు.
రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల చోరీ
రోజుకి 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి చోరీకి గురవుతోంది. మట్టి తవ్వి, రవాణా చేసుకోవాలంటే ఒక క్యూబిక్ మీటర్కు ఇరిగేషన్కు రూ.160, మైనింగ్ డిపార్ట్మెంట్కు రూ.120 మొత్తం రూ.280 చెల్లించాలి. ప్రభుత్వం నుంచి ఏవిధమైన అనుమతులు పొందకుండా, చెల్లింపులు జరపకుండా పచ్చ నేతలు ఈ క్వారీ తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
ఒక్కో టిప్పర్లో 6 యూనిట్ల మట్టి, అంటే 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. అంటే రోజుకి 100 టిప్పర్ల మట్టి రవాణా జరిగితే 15 వందల క్యూబిక్ మీటర్ల మట్టి బయటకు తరలిపోయినట్టే. దీని వల్ల ప్రభుత్వానికి రోజుకి రూ.28 వేలు గండి పడుతోంది. పచ్చ నేతలు రోజుకి 100 టిప్పర్ల మట్టిని విక్రయించడం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా పచ్చ నేతలు కోట్లు గడిస్తున్నారు.
పెద్దల కనుసన్నల్లోనే.. పెద్దల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పట్టపగలు, పొక్లెయిన్లతో పెద్ద ఎత్తున క్వారీ తవ్వకాలు జరుపుతున్నా.. అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇదేంటని ప్రశి్నస్తున్న వారిని నేతలు బెదిరిస్తున్నారని అంటున్నారు.
గోతులు తవ్వి మరీ..
గ్రావెల్ మట్టి కోసం కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు తవ్వి మరీ మట్టిని రవాణా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాలు అగాధాలను తలపిస్తున్నాయి. భవిష్యత్తులో వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి, అటుగా వెళ్లే రైతులు, పశువులు అందులో పడి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ఈ అక్రమ రవాణా కారణంగా ఇప్పటికే కాలువ గట్టు రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి.
అధికారులు గప్చుప్ గోపాలపురం నియోజకవర్గ పెద్దల ఆధ్వర్యంలోనే ఈ మట్టి దందా జరుగుతోంది. జిల్లా అధికార యంత్రాంగం సైతం మామ్మూళ్ల మత్తులో జోగుతోంది. అందుకే ఈ వైపు ఎవరూ కన్నెత్తి చూడటంలేదు. అంతా గప్చుప్గా ఉన్నారు. మూడు పొక్లెయిన్లతో కాలువ గట్లను ఎడాపెడా తవ్వేస్తున్నారు. రోజుకి వంద టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఆగలేదు. కొందరు టీడీపీ నాయకులు సంపాదనే ధ్యేయంగా ఈ దందాకు పాల్పడుతున్నారు. అధికార బలం ఉంది కధా అని, ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు. ఇదేంటని గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు. – బాలం వెంకటేశ్వరరావు, గుణ్ణంపల్లి మాజీ సర్పంచ్


