మరోసారి నోటమ్ వార్నింగ్ జారీ చేసిన భారత్
విశాఖలో రేపటి నుంచి 16 వరకూ నో ఫ్లయింగ్ జోన్గా హెచ్చరికలు
యుద్ధం నేపథ్యంలో మిసైల్ టెస్టింగ్పై సర్వత్రా ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు యుద్ధ వాతావరణంతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షణక్షణం ఉత్కంఠతో అన్ని దేశాలు పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో భారత్ నోటమ్ జారీ చేసింది. విశాఖపట్నం తీరంలో సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 13 నుంచి 16 వరకూ జరగనుందని స్పష్టం చేసింది.
నోటమ్ అంటే..
ఇందుకోసం విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల తర్వాత ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు.
విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ‘నోటమ్’ అని పిలుస్తారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంత వరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారి మళ్లిస్తారు. 13 నుంచి 16వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ క్షిపణి పరీక్ష ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు సమాచారం.
ఇటీవల కాలంలో విశాఖలో అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కే – 4 బాలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ని ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్మెరైన్ నుంచి భారత్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. ఈసారి ఏ క్షిపణిని పరీక్షిస్తారనేది రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. యుద్ధ వాతావరణ సమయంలో
భారత్ చేస్తున్న క్షిపణి ప్రయోగంపై అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


