సంతకాలు పెట్టి.. బయటకు వెళ్లాక మాట మారుస్తారా?

Sajjala Ramakrishna Reddy Comments On teacher unions - Sakshi

ఉపాధ్యాయ సంఘాల తీరుపై ‘సజ్జల’ అసంతృప్తి 

సాక్షి, అమరావతి: చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఉపాధ్యాయుల గురించి వారు అడగడంవల్లే గ్రామాల్లో హెచ్‌ఆర్‌ఏను 9 శాతం నుంచి 10 శాతానికి పెంచి రూ.10 వేల సీలింగ్‌ను రూ.11 వేలకు పెంచామని తెలిపారు.

ఫిట్‌మెంట్‌ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఫిట్‌మెంట్‌పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైనా చర్చించే వారమని సజ్జల తెలిపారు. చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు.

అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదన్నారు.  బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయట నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top