రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోంది | Red Book rule is prevailing in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోంది

Jun 19 2025 5:00 AM | Updated on Jun 19 2025 5:00 AM

Red Book rule is prevailing in the state

ప్రమాణానికి విరుద్ధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు

రెడ్‌బుక్‌ నుంచి పోలీసులు స్ఫూర్తి పొంది ప్రజలను వేధిస్తున్నారు

మీడియా వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు.. 

అలా ఇబ్బంది పడిన ప్రజల్లో నేను కూడా ఒకడిని

సోషల్‌ మీడియాలో నేను పెట్టిన ఒక్క పోస్టుకు డజను కేసులు పెట్టారు

దివ్యాంగుడినైనా నన్ను రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు

ఒకే అంశంపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని ‘సుప్రీం’ చెప్పినా పట్టించుకోవడంలేదు

కోర్టులను ఆశ్రయించడం తప్ప ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేదు

హైకోర్టులో మహానందికి చెందిన తిరుమల కృష్ణ పిటిషన్‌

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరుచేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందిన పండరబోయిన తిరుమల కృష్ణ అలియాస్‌ జగన్‌ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దివ్యాంగుడినైన తనపై రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డజను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు ఈ రెడ్‌బుక్‌ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్‌లో వివరించారు.

ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే, మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్టుచేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. సోషల్‌ మీడియా తాను పెట్టిన ఒకేఒక్క పోస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదుచేసి, దివ్యాంగుడినైన తనను ఇష్టమొచ్చినట్లు తిప్పుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి..
ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడంలేదని తిరుమల కృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసిన బహుళ ఎఫ్‌ఐఆర్‌లలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన హైకోర్టును కోరారు. 

తనపై కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు నమోదుచేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి, మిగిలిన కేసులన్నింటినీ కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరుచేయడంలేదన్నారు. పోలీసుల వేధింపులు, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లయింట్స్‌ అథారిటీలను ఏర్పాటుచేయలేదన్నారు. 

రెడ్‌బుక్‌ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరుల్లో తాను కూడా ఒకడినన్నారు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్‌ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement