
నిలిచిన క్రయవిక్రయాలు.. జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం.
గతంలో 70 శాతానికి పైగా ఆదాయం
కూటమి పాలనలో గత ఏడాది 63 శాతానికి తగ్గుదల
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఏడాది కాలంగా క్రయవిక్రయాలు తగ్గిపోయి రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యాన్ని చేరుకోవడం గగనంగా మారింది. కరోనా విలయతాండవం సమయంలో సైతం లేని గడ్డు పరిస్థితులు కూటమి పాలనలో ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచడం ఈ రంగాన్ని మరింత కుంగదీస్తోంది.
పిల్లల చదువులు, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం పట్టణ జీవనం కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్థానికంగా స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు వారు ఆసక్తి కనబర్చేవారు. జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాలు, సమీప గ్రామాల్లో సుమారు రెండు వేల వరకు లే అవుట్లు వెలిశాయి. ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి. స్థలాలు, ప్లాట్ల క్రయ విక్రయదారులతో కొన్నేళ్ల పాటు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు కళకళలాడాయి. 2019 నుంచి 2024 మధ్యకాలం స్థిరాస్థి రంగానికి స్వర్ణయుగంగా మారింది. విద్య, వైద్య రంగంలో గత ప్రభుత్వం అండగా నిలవడంతో ప్రజల జీవన వ్యయం తగ్గింది. అన్ని వర్గాల వారికి మేలుచేసేలా అమలుచేసిన సంక్షేమ పథకాలు వారి ఆదాయాన్ని మరింత పెంచాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రభుత్వం అండగా నిలవడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి స్థిరాస్థి రంగంలో కొనుగోళ్లు పెరగాయి. గత ఐదేళ్లలో ఏటా ప్రభుత్వం నిర్ధేశించిన రాబడి లక్ష్యం 70 శాతానికి తగ్గలేదు. కరోనా విలయతాండవం చేసిన 2020, 2021 సంవత్సరాల్లో సైతం 76 నుంచి 95 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం.
స్థిరాస్థి రంగం కుదేలు
కూటమి పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. గతంలోని వెంచర్లు, అపార్ట్మెంట్లపై కొన్నిచోట్ల కూటమి నేతలు రాబందుల్లా పడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వర్షాలు, వరదలు, దళారుల దోపిడీలతో తొలకరి పంట నష్టపోగా, గిట్టుబాటు ధరలు లేక ఆక్వా సాగు నిరాశజనకంగా తయారైంది. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అటకెక్కించడంతో జనం వద్ద డబ్బుల్లేక మార్కెట్లో మనీ రొటేషన్ తగ్గిపోయింది. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగల్లో రెడీమేడ్, కిరాణా, బంగారం, ఫ్యాన్సీ, హోమ్నీడ్స్ తదితర వ్యాపారాలు సగం కూడా జరగని పరిస్థితి ఎదురైంది. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. సైట్లు అమ్ముడుపోక అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా కొనేవారు లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో నెలకు రెండు మూడు ప్లాట్లు విక్రయించే వారు గత కొన్ని నెలలుగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి.
తగ్గిన ఆదాయం
ముందెన్నడూ లేని విధంగా రిజిస్ట్రేషన్ శాఖలో గత ఆర్థిక సంవత్సరంలో రాబడి లక్ష్యం కేవలం 63 శాతం నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భూముల విలువను 10 నుంచి 40 శాతం వరకు పెంచడం అంతంతమాత్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 17,394 రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 67.7 కోట్లు ఆదాయం సమకూరగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 15,645 రిజి్రస్టేషన్ల ద్వారా రూ.58.07 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగడం, ప్రజలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని అభిప్రాయపడుతున్నారు.