ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలను ఎందుకు రద్దు చేశారు? | Ration vehicle drivers file urgent petition in High Court | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలను ఎందుకు రద్దు చేశారు?

May 31 2025 3:14 AM | Updated on May 31 2025 3:14 AM

Ration vehicle drivers file urgent petition in High Court

వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హఠాత్తుగా రద్దు చేయడంతో మేమంతా రోడ్డున పడ్డాం

ఈ వ్యవస్థతో యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతోంది 

2027 వరకు బ్యాంకుకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంది 

హైకోర్టులో రేషన్‌ వాహనాల డ్రైవర్లు అత్యవసర పిటిషన్‌ 

విచారణ 4 వారాలకు వాయిదా 

సాక్షి, అమరావతి: ఇంటికే రేషన్‌ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌–ఎండీయూ) వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 23న జారీ చేసిన జీవో 5ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది. 

ఎండీయూ వ్యవస్థను ఎందుకు రద్దు చేశారో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా­లని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఎండీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రేషన్‌ డెలివరీ వాహనాల డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని, తమకు ఎలాంటి ఆర్థిక పునరావాసం కల్పించకుండా, బ్యాంకు రుణాల చెల్లింపు నుంచి ఉప­శమనం ఇవ్వకుండా, ప్రత్యా­మ్నాయ జీవనం చూప­కుండా ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరానికి చెందిన తానేటి రామకృష్ణ, ధనంజయకుమార్, గుట్టం రాజు సుచాన్‌సింగ్, త్రినాథ్‌ హైకో­ర్టులో లంచ్‌­మోషన్‌ రూపంలో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ల తరఫున న్యాయవాది రేగులగడ్డ వెంకటేష్‌ వాదనలు వినిపించారు.

బ్యాంకుకు నెలవారీ వాయిదాలు కట్టాలి.. 
‘ఇంటింటికీ వెళ్లి రేషన్‌ అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వ్యవస్థతో యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతోంది. వాహనాల కొనుగోలు నిమిత్తం పిటిషనర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. 2024లో ప్రభుత్వం మారాక కూడా ఏడాదిగా పిటిషనర్లు ఎండీయూల ద్వారా సమర్థంగా సరుకులను అందజేశారు’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది వెంకటేష్‌ నివేదించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ జీవో 5 జారీ చేసింది.

పిటిషనర్లందరూ బ్యాంకులకు 2027 వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రోడ్డున పడుతున్నారు. ఈ వాహనాలనే నమ్ముకుని వారంతా జీవనం సాగిస్తున్నారు. వాయిదాలు చెల్లించకుంటే బ్యాంకులు కఠిన చర్యలకు దిగుతాయి. రేషన్‌ వాహనాల డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. పిటిషనర్లకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలి. జీవో 5పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’ అని వెంకటేష్‌ అభ్యర్థించారు.  

కూటమి సర్కార్‌ వల్ల రోడ్డున పడ్డాం
మమ్మల్ని మీరే ఆదుకోవాలి 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రేషన్‌ వాహనాల డ్రైవర్ల యూనియన్‌ విజ్ఞప్తి 
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవస్థను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 18 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద రేషన్‌ వాహ­నాల డ్రైవర్లు వాపోయారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల తమతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రాగానే.. ఈ వ్యవస్థను పునరుద్ధరించి తమకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిసి వారు వినతిపత్రం ఇచ్చారు.

ఇంటింటికీ రేషన్‌తోనే ప్రజలకు మేలు..
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నోసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన మీరు ప్రజలందరి జీవితాల్లో మార్పు కోసం కృషి చేశారు. వాటిలో మీరు ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవస్థ అన్నింటిలోనూ మిన్నగా నిలిచింది. ఈ వ్యవస్థ మాకు ఉపాధి కల్పించడమే కాకుండా.. దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు ఏజెన్సీలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు రేషన్‌ సరుకుల కోసం ఇబ్బందులు పడకుండా చేసింది. ఈ వ్యవస్థ రాకముందు రేషన్‌సరుకుల కోసం రోజుల తరబడి డీలర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

కానీ మీ ప్రభుత్వంలో రేషన్‌ దుకాణాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా.. వాగులు, వంకలు దాటుకుంటూ కిలోమీటర్ల దూరం నడవాల్సిన అవసరం లేకుండా.. ప్రజలకు ఇంటి వద్దే రేషన్‌ సరుకులు అందాయి. కానీ, ఇప్పుడు కూట­మి ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రేషన్‌ వాహనాలున్న 9,260 కుటుంబాలతో పాటు వారికి సహాయకులుగా ఉన్న మరో 9,260 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్సార్‌సీపీ మళ్లీ అ«ధికారంలోకి రాగానే.. ఈ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించి మాకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ను రేషన్‌ వాహనాల డ్రైవర్ల యూనియన్‌ ప్రతినిధులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement