ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్‌ అందజేసిన ఎమ్మెల్యే | Ramireddy Pratap Kumar Reddy who went home and Handed over the Pension | Sakshi
Sakshi News home page

ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్‌ అందజేసిన ఎమ్మెల్యే

Jan 2 2023 7:44 PM | Updated on Jan 2 2023 7:44 PM

Ramireddy Pratap Kumar Reddy who went home and Handed over the Pension - Sakshi

పింఛన్‌ మంజూరైన విషయాన్ని యువతికి చెబుతున్న ఎమ్మెల్యే, యువతి సంతోషం

ఒక దీపం వెలిగింది. మౌనరోదన మోములో సంతోషం వెల్లివిరిసింది. జీవన తేజంతో నవ్వులు పూయించింది. చీకట్లు ముసిరిన ఆ ఇంట ప్రభాత వెలుగులు నింపాయి. ఆ దివ్యాంగురాలి జీవనానికి ఆసరా దొరికింది. ఆమె జీవితానికి భరోసాగా నిలిచింది. ఆ ప్రభావ ప్రభాత దీపిక పేరే ‘పింఛన్‌’. అర్హులైన అభాగ్యులపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం.   


కావలి:
ఆమెకు 28 ఏళ్లు. పుట్టుక నుంచే శరీరంలో ఏ అవయవం పని చేయదు. కదల్లేదు. మాట్లాడలేదు. శారీరకంగా.. మానసికంగా దివ్యాంగురాలు. 20 ఏళ్లుగా ఆమె బతుకు దెరువుకు ఆసరాగా సామాజిక పింఛన్‌ కోసం కుటుంబ సభ్యులు అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. 

కావలి పట్టణం 39వ వార్డులోని మూర్తిశెట్టివారివీధికి చెందిన ఈశ్వరమ్మ దివ్యాంగురాలు. తండ్రి చనిపోయాడు. తల్లి సైతం మానసికంగా కుంగిపోవడంతో ఆమె పనులే ఆమె చేసుకోలేని దయనీయ పరిస్థితి. తల్లికి వైఎస్సార్‌ వితంతు పింఛన్‌ కానుక వస్తోంది. తల్లిని, చెల్లిని సోదరుడు కూలి పనులు చేసి పోషిస్తున్నాడు. అతని భార్యే ఇటు అత్తను, అటు దివ్యాంగురాలైన ఆడపడుచుకు సపర్యాలు చేస్తోంది.  


వలంటీర్‌ చొరవతో..  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వచ్చాక ఆ దివ్యాంగురాలి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆమెకు పింఛన్‌ మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఆమెకు ఆధార్‌కార్డు లేదు. రేషన్‌ కార్డులేదు. దీంతో ఆమెకు పింఛన్‌ మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆమెకు వేలిముద్రలు ఆధార్‌ కార్డుకు సరిపోవడం లేదు. కుడి చేయిలో ఒక వేలి ముద్ర మాత్రమే రికగ్నైజ్‌ అవుతోంది. అధికారులు చర్యలు చేపట్టి ఆమెకు ఆధార్‌ కార్డు ను వచ్చేలా చేశారు. ఈలోగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న వార్డుకు ఎంపికైన వలంటీర్‌ గణవరపు అనూషా ఆమెకు పింఛన్‌ కల్పించేందుకు స్వయంగా తన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని తిరిగి కృషి చేసింది.

పింఛన్‌ మంజూరు కోసం తొలుత రేషన్‌కార్డు మంజూరు చేయడానికి సాంకేతిక కారణాలతో ఆధార్‌ లింక్‌ కాక పెండింగ్‌లో పడింది. దీంతో  రెండు మూడు సార్లు ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పర్మినెంట్‌ నంబరుతో తల్లి రేషన్‌కార్డులో ఈశ్వరమ్మను యాడ్‌ చేయించింది. చివరగా సదరం సర్టిఫికెట్‌ కోసం నాలుగైదు సార్లు నెల్లూరుకు తిరిగింది. కరోనా రావడం తో సదరం సర్టిఫికెట్ల మంజూరు నిలిచిపోయింది. ఇటీవల సదరం సెంటర్‌ పునః ప్రారంభం కావడంతో ఎట్టకేలకు సదరం సర్టిఫికెట్‌ మంజూరు కావడంతో పింఛన్‌కు నమోదు చేసింది. తాజాగా మంజూరు అయిన పింఛన్ల జాబితాలో ఆమె పేరు వచ్చింది.  


ప్రభాత వేళ.. ఆనంద హేళ 

ఆమెకు పింఛన్‌ మంజూరు కావడంతో ప్రభాత వేళ మంచు తెరలను దాటుకుంటూ స్వయంగా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వలంటీరు, సచివాలయ ఉద్యోగులను వెంట పెట్టుకొని ఆ యువతి ఇంటికి వెళ్లి పింఛన్‌ వచ్చిన విషయాన్ని తెలియజేశారు. దీంతో భావోద్వేగంతో ఆనంద భాష్పాలు కార్చింది. చాలా కాలం తర్వాత తనకు పింఛన్‌ వచ్చేలా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సైగలు చేసింది. ఎమ్మెల్యే సైతం ఆమెను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖతో పాటు రూ.3 వేల నగదు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందుతుందని చెప్పారు. అన్ని విధాలా వలంటీర్లు స్వయంగా సేవా దృక్పథంతో పని చేసి ప్రజలకు అండగా ఉంటారని ఈ ఉదంతం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. (క్లిక్‌: సినిమా రేంజ్‌లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..)

Advertisement
 
Advertisement
Advertisement