
నేడూ దక్షిణ కోస్తా, రాయలసీమలో వానలు
సాక్షి, విశాఖపట్నం: గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు దగ్గర అర్థరాత్రి తీరం దాటింది. తీరం దాటిన తర్వాత శుక్రవారం ఉదయం నాటికి బలహీనపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడులో వర్షాలు జోరందుకోనున్నాయి.
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనుంది.