అల్పపీడనం.. ఆలస్యం | Rains In North Andhra And South Coast Today And Tomorrow, Check Out Complete Rainfall Weather Report Inside | Sakshi
Sakshi News home page

Rainfall In Telugu States: అల్పపీడనం.. ఆలస్యం

Jul 24 2025 3:57 AM | Updated on Jul 24 2025 11:29 AM

Rains in North Andhra and South Coast today and tomorrow

నేడు ఉపరితల ఆవర్తనం

రేపు ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం

నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వానలు

సాక్షి, విశాఖపట్నం, సాక్షి అమరావతి: ఉష్ణ మండల తుపాను కారణంగా.. ఉత్తర కోస్తాకు సమీపంలో బుధవారం ఏర్ప­డాల్సిన అల్పపీడనం కాస్తా ఆలస్య­మైంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వా­య­వ్య బంగాళా­ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసా­గుతోంది. దీనికి అనుబంధంగా.. గు­రువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరి­తల ఆవర్తనం ఏర్ప­డే అవకాశం ఉంది. దీని ప్రభా­వంతో శుక్రవారం నా­టికి ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడు­తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం రెండూ ఉత్తర కోస్తాకు సమీపంలోనే కొనసాగు­తూ.. క్రమంగా ఒడిశా వైపుగా కదలనున్నాయి. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు­న్నాయి. అదేవిధంగా.. రాయలసీమలో అక్కడక్క­డా మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షా­లు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ముఖ్యంగా గురు, శుక్రవా­రా­ల్లో శ్రీకా­కుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా మో­స్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వా­నలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వ­హణ సంస్థ ఎండీ ప్రఖార్‌ జైన్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవా­లని సూచించారు. 

పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్‌ కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కంచిలిలో 71 మి.మీ., నరసన్నపేటలో 65, కోట­బొమ్మాళిలో 55, మందసలో 50, కవిటి రాజపురంలో 48, ఇచ్ఛాపురంలో 43, వజ్రపు­కొత్తూరులో 42, పలాసలో 40, సీతంపేటలో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement