మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం | Pulaparthi Satyadev cheated in the name of marriage | Sakshi
Sakshi News home page

మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం

Jun 16 2025 4:12 AM | Updated on Jun 16 2025 4:17 AM

Pulaparthi Satyadev cheated in the name of marriage

పెళ్లొద్దంటూ టీడీపీ నేతలదుప్పటి పంచాయితీ

రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం 

దళిత మైనర్‌ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన పులపర్తి సత్యదేవ్‌  

కులం తక్కువ దానివి..ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషణ 

ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా.. 8వ నెలలో సిజేరియన్‌.. పురుటి బిడ్డకు వైద్యం అందకుండా చేసి చంపేయించిన వైనం 

టీడీపీ నేతల ఒత్తిడితో ఘటనను తొక్కిపెట్టిన పోలీసులు.. ఈ నెల 4న కలెక్టర్‌కు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు 

పెళ్లికి వారం గడువు కోరి.. పరారైన నిందితుడు 

వైఎస్సార్‌సీపీ నేతల జోక్యంతో పోక్సో కేసు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు, వందిమాగధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాల నుంచి నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ తరుణంలో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు  అల్లుడు వరుసయ్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్‌ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్‌ బాలిక (17)ను గర్భవతిని చేసి.. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు.

ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కా­లంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులిప్పిస్తామని.. పెళ్లొద్దంటూ దుప్పటి పంచాయితీ చేస్తు­న్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నా­డు. టీడీపీ పెద్దలు డబ్బులిప్పిస్తామంటూ దుప్పటి పంచాయితీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. 

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్‌ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్‌ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు. తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని, తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి.. ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడు. సత్యదేవ్‌ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూ­షి­స్తూ అబార్షన్‌ చేయించుకోవాలని డిమాండ్‌ చేశాడు.  

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు 
సత్యదేవ్‌ మోసంపై రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నా­నని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. 

ఈ క్ర­మంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది. అబార్షన్‌ చేయడం ప్రమా­దమని వైద్యు­లు చెప్పి, సిజేరియన్‌ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్‌ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ్డ ఉన్నట్లుండి చనిపోయా­డు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకో­లేదు. 

దీంతో బాధిత కుటుంబం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ నెల 4న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్య­దేవ్‌ను పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువు ఇచ్చారు. అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు. దీంతో ఈ బాగోతాన్ని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి మీడియా ఎదుట బయటపెట్టారు. 

బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలి­కకు తన అను­చరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరు­గు­తున్నా టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్‌­రామ్‌ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌కు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.

మానవతా దృక్పథంతోనే కేసు నమోదులో ఆలస్యం
మానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుకు ఆలస్యమైంది. ఈనెల 4న బాధితురాలు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లా వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మిన్‌ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమెకు నేను, సౌజన్య కౌన్సెలింగ్‌ చేశాం. సత్యదేవ్‌తో తనకు పెళ్లి జరిపించాలని కోరింది. సత్యదేవ్‌ను, అతని బాబా­యిని పిలిపించి మాట్లాడాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటా­నని పది రోజులు గడువు కోరాడు. ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం. 

నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్‌పై క్రైంనెంబర్‌ 197/2025 యు/ఎస్‌64(2)(ఎం), 89బిఎన్‌ఎస్,సెక్షన్‌ 5(1)ఆర్‌/డబ్ల్యూ 6ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 3(2)(వి) ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ 1989 కింద కేసు నమోదు చేశాం. సత్యదేవ్‌ కోసం గాలిస్తున్నాం. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం.  – బి.విద్య, డీఎస్పీ, తూర్పు జోన్, రాజమహేంద్రవరం

ఆరేళ్ల బాలికపై అత్యాచారం 
కర్నూలులో దారుణం 
నిందితుడిపై పోక్సో కేసు
కర్నూలు: కర్నూలులో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం టీచర్స్‌ కాలనీలో విజయ్‌కుమార్‌ అలియాస్‌ రాజు (40) ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్డాడు. ఇతనికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న బాలికను ఇంట్లోకి పిలిచి ఈ నెల 13న దారుణానికి ఒడిగట్టాడు. 

శనివారం బాలిక మూత్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటంతో తల్లి కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement