
కర్రతో ముగ్గురిపై దాడి
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు..తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై విరుచుకుపడ్డాడు. శేఖర్ (55) అనే యాచకుడిపై, కపిల తీర్థం సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
వలలో బంధించి..
ఘటనకు మూలకారకుడైన సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు.రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట అతను కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వలవిసిరి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద ఓ కత్తి కూడా ఉంది. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
