
సాక్షి,విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ లభించింది. పీఎస్ఆర్కు జిల్లా అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై బీపీ,గుండె సమస్యలతో బాధపడుతున్న పీఎస్ఆర్.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కోర్టు పీఎస్ఆర్ మెడికల్ రిపోర్ట్ను అందించాలని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు చేశారు. అనంతరం రిపోర్టులను కోర్టుకు అందించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పీఎస్ఆర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్న పీఎస్ఆర్ను మెరుగైన వైద్యం కోసం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు.