
చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, అనంతపురం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించనున్నాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొదటి ప్రాధాన్యతా ఓట్లలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి శనివారం తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.