
పెద్దాసుపత్రిలో విషపురుగులు
యథేచ్ఛగా తిరుగాడుతున్న పాములు, ఎలుకలు
రాత్రిళ్లు దోమల బెడదతో సతమతం
రూ.70లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం అంతంతే..
నాలుగు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎన్టిఆర్ వైద్యసేవ కార్యాలయంలో పది అడుగుల నాగుపాము కనిపించింది. గది బయట బుసలుకొడుతున్న పామును చూసి ఓ ఉద్యోగికి గుండె ఆగినంత పనయింది. వెంటనే తేరుకొని కేకలు వేయగా చుట్టుపక్క ఉద్యోగులు వచ్చేసరికి ఓ తొర్రలోకి జారుకుంది. దీంతో మళ్లీ అది బయటకు రాకుండా సిమెంట్తో ఆ తొర్రను మూసేశారు.
ఆసుపత్రిలోని ఓ అధికారి ఛాంబర్లో ఎలుకలు విపరీతంగా వచ్చి ఫైళ్లు పాడుచేసేవి. ర్యాట్ప్యాడ్లు పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కాస్త తెలివిగా ఆలోచించాడు. ఎక్కడికక్కడ బిస్కెట్లను ఏర్పాటు చేయడంతో వాటిని తిన్న ఎలుకలు ఫైళ్ల జోలికి వెళ్లకపోవడం గుర్తించాడు. ఇదేదో బాగుందని అదే ఉపాయాన్ని కొనసాగించారు.
ఆసుపత్రిలో చెట్ల నీడ ఉందని వెళ్లి భోజనానికి కూర్చుంటే చాలు పందులు, కోతులు, కుక్కలతో పాటు ఎలుకలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల రోగుల సహాయకులు ప్రశాంతంగా నాలుగు ముద్దలు కూడా తినలేని పరిస్థితి. రాత్రయితే చాలు దోమల దండయాత్ర నిద్రను దూరం చేస్తోంది. రాత్రిపూట అటుంచితే.. పట్టపగలే ఆసుపత్రి ఆవరణలో పాములు తిరుగాడుతుండటంతో రోగుల గుండె జారుతోంది. ఎలుకలు పట్టేందుకు బోధనాసుపత్రిలో ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు మెడికల్ కాలేజీ, ప్రాంతీయ కంటి ప్రభుత్వ ఆసుపత్రిలలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు బోధనాసుపత్రిలో సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ కింద దోమలు, బల్లులు, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, పాములు, ఇతర విషకీటకాల నివారణకు వాడే పెస్టిసైడ్స్ను మధ్యాహ్నం వరకు హెల్త్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలుకలు, పాములు ఉంటే వాటిని పట్టుకుని సంహరించాలి.
ఈ మేరకు నిర్వహణకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు రూ.5లక్షలు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో రూ.30వేలు, మెడికల్ కాలేజిలో మరో రూ.30 వేలు కలిపి నెలకు రూ.5.90 లక్షలు, ఏడాదికి రూ.70,80,000 వెచ్చిస్తున్నారు. నిర్వహణ సంస్థలో పది మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆరుగురితో మమ అనిపిస్తుండటం వల్లే విష పురుగులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయని తెలుస్తోంది.
పట్టపగలే ఎలుకలు, పాముల సంచారం
ఆసుపత్రి, కళాశాల ఆవరణలో రాత్రేమో గానీ ఖాళీ ప్రదేశాల్లో పట్టపగలే ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి బయటకు వచ్చి వార్డులు, కార్యాలయ గదుల్లోకి దూరుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ గైనిక్ విభాగం, శక్తిసదన్, కంటి ఆసుపత్రిలోని ఖాళీ ప్రదేశాలు, డైట్ విభాగం, దాని పక్కనున్న ఖాళీ ప్రదేశాలు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రాంతం, సూపర్స్పెషాలిటి విభాగం పక్కనున్న ఖాళీ ప్రదేశం, ఐడీ వార్డు, మానసిక వ్యాధుల విభాగం, యుపీ, పీజీ హాస్టల్స్ పరిసరాలు పాములకు నిలయాలుగా మారాయి. ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మొక్కలు ఏపుగా పెరగడంతో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి.
వీటిని తినేందుకు పాములు వస్తున్నాయి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వద్ద ఇటీవల నిరుపయోగంగా ఉన్న ఇనుప సామాను అంతా కుప్పపోసి ఉంచారు. వాటిని టెండర్ పాడిన వారు తీసుకెళ్లకపోవడంతో ఆ ప్రాంతంల్లో పాముల సంచారం అధికంగా ఉంటోందని రోగుల సహాయకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల బంధువులు ఆరుబయట భోజనం చేసి, అక్కడే చేతులు కడుక్కోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని తినేందుకు ఎలుకలు, బొద్దింకలు అధికంగా పుట్టుకొస్తున్నాయి.
చీకటి పడితే చాలు దోమల బెడద
బోధనాసుపత్రిలో రోజూ సాయంత్రం అయితే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. వాటి బారి నుంచి రక్షణ పొందేందుకు రోగులు, వారి సహాయకులు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడుతున్నారు. అన్ని విభాగాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.
తూతూ మంత్రంగా పెస్ట్కంట్రోల్ నిర్వహణ
ఆసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణ తూతూ మంత్రంగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్ర మే సంబంధిత ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాములు, ఎలుకలు, పందికొక్కులు తిరిగే చోటును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.
వీరి పనితీరును బట్టి అధికారులు మార్కులు వేయాల్సి ఉంటుంది. పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే ఇటీవల మూడు నెలలుగా బిల్లులకు ఆసుపత్రి అధికారులు బ్రేక్ వేశారు. టెండర్ కాలపరిమితి ముగియడంతో అధికారుల చర్యలకు సైతం కాంట్రాక్టర్ స్పందించడం లేదని సమాచారం.
పగలు ఈగలు, రాత్రి దోమల బాధ
మా అక్క కూతురు కాన్పు కోసం 16 రోజుల క్రితం గైనిక్ వార్డులో చేర్చాం. ఆమెకు రక్తస్రావం అవుతుంటే ప్రసవం ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో పగలు, రాత్రి వార్డు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడి కారు షెడ్డులో రాత్రివేళ ఉంటున్నాం. ఇక్కడ పగలు ఈగలు, రాత్రి దోమల బాధ భరించలేకున్నాం. ఏదైనా తిందామంటే కూడా తిప్పలే. అందుకనే నెట్ తెచ్చుకొని అందులో ఉంటున్నాం. – అంజలి, నంద్యాల పట్టణం
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రిలో ఎలుకలు పట్టేందుకు అవసరమైన ప్యాడ్లను ఏజెన్సీ వారు తెప్పించారు. పాములు రాకుండా అవసరమైన రసాయనాలు అక్కడక్కడా ఉంచుతున్నారు. ఎక్కడైనా ఎలుకలు, పాములు సంచరిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు