
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు.
