
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘తుపాకులా.. పప్పుబెల్లాలా’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనంపై పోలీస్ యంత్రాంగం స్పందించింది. తుపాకులు వేలం వేయడంలో అవకతవకలు జరిగిన విషయాన్ని పోలీసులు అంగీకరించారు. అంతర్గత తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
వేలం నిర్వహణ ప్రక్రియలో జరిగిన లోపాలు, సంబంధిత విభాగాల పోలీస్ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. విచారణలో బహిర్గతమయ్యే వాస్తవాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా శాఖాపరమైన చర్యలుంటాయని ఎస్పీ పేర్కొన్నారు.