మృత్యుసాగరం? | Plastic Waste Growing In The Ocean | Sakshi
Sakshi News home page

మృత్యుసాగరం?

Nov 26 2021 4:25 PM | Updated on Nov 26 2021 5:06 PM

Plastic Waste Growing In The Ocean - Sakshi

ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం..

సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్‌లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు, స్టింగ్‌రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కాలుష్యమే ప్రధాన శత్రువు 
వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. 

ప్లాస్టిక్‌ సీగా మార్చేస్తున్నారు.. 
అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్‌ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పాలిథిన్‌ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాతపడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్‌ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్‌ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. 

ప్లాస్టిక్‌ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు 
సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్‌ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ప్రతి రోజూ  100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది.

జీవవైవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత 
ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్‌ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. 
– బలరాంనాయుడు, లివింగ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ ప్రతినిధి 

చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్‌ వ్యర్థాలు 
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్స్‌ సంస్థతో కలిసి ఎన్‌ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్‌ పొల్యూషన్‌ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.  తీరాన్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి.  
– డా. కె.ఎస్‌.ఆర్‌.మూర్తి, ఎన్‌ఐవో విశ్రాంత శాస్త్రవేత్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement