
కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
12 రోజులుగా మృత్యువుతో పోరాటం
శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస
హార్ట్ స్ట్రోక్తో కన్నుమూసినట్లు వైద్యుల నిర్ధారణ
పోస్టుమార్టం పూర్తి.. స్వగ్రామానికి మృతదేహం తరలింపు.. నాగాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు, విద్యార్థుల డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు /బుట్టాయగూడెం : ఆత్మహత్యా యత్నం చేసి.. మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి (22) తుది శ్వాస విడిచింది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ (బొల్లినేని) ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతోంది.
ఆమెకు అదే కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆమె మెదడు పనితీరు క్షీణిస్తూ.. ఇతర అవయవాల పనితీరు సన్నగిల్లుతూ వచ్చింది. గురువారం రాత్రి పూర్తి విషమంగా మారడంతో ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. అదే సమయంలో ఆమెకు గుండె సమస్య అధికమైంది.
దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి, గుండె ఆగిపోవడంతో నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి తీసుకెళ్లారు.
దీపక్ వేధింపుల వల్లే దారుణం
ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఆ ఇంజక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది.
అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే.. గత నెల 24న బయటకు వచ్చిoది. దీంతో ఆమె తీసుకున్న ఇంజక్షన్ ఏమిటనే విషయం బహిర్గతమైంది. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరన్నది ఆ లేఖలో ఆమె స్పష్టంగా రాయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్ను అరెస్టు చేశారు.
బాధితురాలికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ
నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం.. నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై 28న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఘటన జరిగిన తర్వాత నాగాంజలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నాగాంజలిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన దీపక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రౌతుగూడెంలో ప్రజల ఆందోళన
నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్స్లో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగాంజలి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుంది
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు
నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కూటమి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అ«ధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం కళ్యాణి మీడియాతో మాట్లాడారు.
తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం దారుణం అని అన్నారు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
‘గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు’ అని వరుదు కళ్యాణి విమర్శించారు. వీళ్ల వాగ్దానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతోందన్నారు.