
రావికమతం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ విధానానికి కూటమి సర్కారు మంగళం పాడటంతో అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తలపై సరుకుల మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. రావికమతం మండలం కళ్యాణలోవ గ్రామానికి దగ్గరలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) డిపో ఉంది. ఈ డిపో నుంచి నీడబంద గ్రామానికి 13 కిలోమీటర్ల దూరం.
అజయ్పురం, బంగారు బందలు, కడగడ్డ గంగాదేవిపేట, రొచ్చిపనుకు, రాయిపాడు, పెదగరువు, తాటిపర్తి గ్రామాల వారికి సైతం ఇంచుమించు అదే దూరంలో ఈ జీసీసీ డిపో ఉంటుంది. ఇన్నాళ్లూ తమ గ్రామానికో.. రోడ్డు సదుపాయం ఉన్న సమీప గ్రామానికో రేషన్ బండి వస్తే హాయిగా సరుకులు తెచ్చుకున్న గిరిజనులు ఇప్పుడు అంత దూరం కాలినడకన డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనైనా ఎండీయూ వాహనాలు నడపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం సమీపంలోని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల జెడ్.జోగింపేటలో సబ్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 300 రేషన్ కార్డులున్నాయి. సెల్ టవర్లున్నా సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఆఫ్లైన్లో బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. బియ్యం ఉచితంగా ఇస్తున్నా ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, రోడ్డు సదుపాయం లేని గ్రామాల వారు నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి నరక యాతన అనుభవిస్తున్నారని, తమ కష్టాలు తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.