రెండేళ్ల వెయిటింగ్‌.. 9 రోజుల్లో క్లోజింగ్‌!.. పింఛన్ల పోర్టల్‌కు ‘తాళం’ | Pension Portal Closed in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండేళ్ల వెయిటింగ్‌.. 9 రోజుల్లో క్లోజింగ్‌!.. పింఛన్ల పోర్టల్‌కు ‘తాళం’

Sep 20 2026 3:34 AM | Updated on Sep 20 2026 3:34 AM

Pension Portal Closed in Andhra Pradesh

రెండేళ్ల తర్వాత తెరుచుకున్న పింఛన్ల దరఖాస్తు పోర్టల్‌

పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే మూత

ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడానికీ సమయం ఇవ్వకుండా నిలిపివేత 

కొత్త పింఛన్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో నిరంతరాయంగా దరఖాస్తుల స్వీకరణ 

సంతృప్త స్థాయిలో అర్హులకు పింఛన్ల మంజూరు 

చంద్రబాబు సీఎం అయ్యాక ఆగిపోయిన కొత్త పింఛన్ల మంజూరు 

స్థానిక ఎన్నికల నేపథ్యంలో మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ 

కేవలం 9 పని దినాల్లో 13.63 లక్షల దరఖాస్తులు మాత్రమే నమోదు

సాక్షి, అమరావతి: కొత్త పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ పట్టుమని పది రోజులు కూడా సాగలేదు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కారి్మకులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులకు కొత్త పింఛన్లకు అర్హత ఉన్నా.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకునేలోపే దరఖాస్తు ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల నమోదు ప్రక్రియ కేవలం 9 పనిదినాల్లో శుక్రవారం (18వ తేదీ)తో ముగిసింది. గడచిన రెండేళ్ల రెండు నెలల కాలంలో అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఒకరోజు ముందు ప్రకటించి మరునాటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదును మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లపాటు పింఛన్‌ కోసం ఎదురు చూసిన లక్షలాది మంది ఒకేసారి దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయాలకు క్యూ కట్టారు. దరఖాస్తులు స్వీకరించిన ప్రతిరోజూ దరఖాస్తుల నమోదు పోర్టల్‌ మొరాయించింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులు అన్ని అర్హతలున్నా వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.  

అష్టకష్టాలు పడి పత్రాలు తెచ్చుకున్నా.. 
పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌ కార్డులో గతంలో ఏమైనా మార్పులు చేసుకున్నారా అనే వివరాల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ పత్రం ఎక్కడ దొరుకుతుందో తెలియని అవ్వాతాతలు వారం రోజులపాటు అన్ని ఆఫీసులు, ఆధార్‌ సెంటర్ల చుట్టూ తిరిగారు. చాలామంది ఆ మార్పులు, చేర్పుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకునేలోపే దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. 

వితంతువులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు. పింఛన్‌ దరఖాస్తుతోపాటు భర్త మరణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడానికే కనీసం 21 రోజులు సమయం పడుతుంది. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కనీసం పది రోజులు కూడా సాగకపోవడంతో ఆ నిర్ణీత గడువులోగా అర్హత ఉండీ దరఖాస్తు చేసుకోలేకపోయిన లక్షలాది మంది పేదలు ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటుందోనని ఆందోళన పడాల్సిన పరిస్థితి వచ్చింది. 

ఎవరికి ఎప్పుడిస్తారో తెలియదు.. అంతా గోప్యతే 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన వారు వలంటీర్ల ఆధ్వర్యంలో నిరంతరం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. అప్పట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ఎప్పుటికప్పుడే కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఏ సచివాలయ  పరిధిలో ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలతో అందులో ఎవరికి మంజూరు చేశారు, ఎవరికి ఏ కారణంతో తిరస్కరించారనే వివరాలను గ్రామసభలో చర్చించి, ఆయా జాబితాలను ఆయా సచివాలయాల నోటీసు బోర్డుల్లో పెట్టేవారు. 

అప్పట్లో అంతా పూర్తి పారదర్శకంగా పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగగా.. చంద్రబాబు సీఎం అయ్యాక రెండేళ్ల రెండు నెలల తర్వాత దరఖాస్తులకు వీలు కల్పించి, ఆ ప్రక్రియనంతా రహస్యంగా చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరు ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా.. ఆ దరఖాస్తు వివరాలన్నీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు 7వ తేదీ తర్వాత మొదట రెండు రోజులపాటు అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచారు. 

గత శుక్రవారం నుంచి దరఖాస్తుల సంఖ్యతో పాటు దరఖాస్తుదారుల వివరాలన్నీ ప్రభుత్వం అందరికీ కనిపించకుండా చేసింది. ఈ మేరకు సచివాలయాల సేవ పోర్టల్‌లో మార్పులు చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా మాత్రమే మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు చూస్తే  అర్హతల్ని పక్కన పెట్టి పచ్చపార్టీ నేతలకు నచ్చిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  

13.63 లక్షల దరఖాస్తులు 
ఈ నెల 7నుంచి 18వ తేదీ వరకు దాదాపు 13.63 లక్షల దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందులో దాదాపు సగం అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఆ దరఖాస్తులపై లబ్ధిదారుల ఇళ్ల వద్ద పరిశీలన కార్యక్రమం ఈ నెల 23 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. ఆ తరువాత ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబితాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement