ఆ జ్ఞాపకం... ఓ విషాదం | One Year Completed To Kachuluru Boat Accident | Sakshi
Sakshi News home page

ఆ జ్ఞాపకం... ఓ విషాదం

Sep 15 2020 9:09 AM | Updated on Sep 15 2020 12:30 PM

One Year Completed To Kachuluru Boat Accident - Sakshi

రంపచోడవరం : దేవీపట్నానికి సమీపంలోని కచ్చులూరు వద్ద పాపికొండలకు చేరువలో పర్యాటకులతో వెళ్తున్న వశిష్ట బోటు గోదావరిలో మునిగి మంగళవారానికి ఏడాది అవుతోంది. నాటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అప్పటి నుంచీ పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మునిగిపోయిన ఈ బోటును వెలికి తీసేందుకు 38 రోజులు పట్టింది. కచ్చులూరు గిరిజనుల సాహసం ఫలితంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. 46 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. (వారిని గోదారమ్మ మింగేసిందా?)

బోటు బయలుదేరినప్పటి నుంచీ...సెప్టెంబరు 15న పోచమ్మ గండి నుంచి రాయల్‌ వశిష్ట బోటు ఉదయం 9.30కు బయలుదేరింది. అక్కడి నుంచి దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరిన సమయంలో అనుమతుల విషయంలో పోలీసులతో వాగ్వివాదం జరిగి, తిరిగి బోటు ప్రయాణం పాపికొండల వైపు సాగింది. మధ్యాహ్నం 1.48 గంటలకు కచ్చులూరు మందం వద్దకు చేరింది. అక్కడ కొండ మలుపు వద్ద కచ్చులూరు మందంలో బోటు ఒక్కసారిగా కుదుపునకులోనై మునిగిపోయింది. కచ్చులూరు, తూటిగుంట గిరిజనులు బోటు మునిగిపోతుండంగా 26 మందిని కాపాడారు. (6.3 లక్షల చొప్పున సాయం)

24 గంటలు గడవక ముందే 
గోదావరిలో బోటు మునిగిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం స్పందించారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అధికారులు అందజేశారు. ప్రమాదం జరిగిన 24 గంటలలోపే బోటు మునిగిన ప్రాంతాన్ని ఏరియాల్‌ వ్యూ ద్వారా గుర్తించారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతుల వద్దకు వెళ్లి పరామర్శించారు.

బోటును వెలికితీసేందుకు... 
కచ్చులూరు మందంలో మునిగిన వశిష్ట బోటును వెలికితీసేందుకు నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రయత్నించాయి. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా బోటు జాడను కనిపెట్టలేకపోయారు. బోటు వెలికితీతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్స్‌ ధర్మాడి సత్యం బృందానికి అప్పగించారు. గోదావరిలో మునిగిన బోటును ఐరన్‌ రోప్, క్రేన్‌ సహాయంతో బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలం కావడంతో, ప్రైవేట్‌ డైవర్లు బోటు అడుగు భాగానికి వెళ్లి బోటుకు రోప్‌ బిగించడంతో కథ సుఖంతామైంది. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాల గాలింపు, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు, వారి బంధువులకు మృతదేహాలు అప్పగింత వరకు అధికారులు ఎంతో శ్రమించారు. 

Advertisement
 
Advertisement
Advertisement