
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. నర్సింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లోని ఓ గదిలోకి అర్ధరాత్రి ప్రిన్సిపాల్ దూరడంతో విద్యార్థినిలు అతడిని గదిలోనే బంధించారు. దీంతో, హస్టల్ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. లీలామహల్ సర్కిల్లోని వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వర్మ.. బుధవారం అర్థరాత్రి విద్యార్థినులు గదిలో దూరారు. దీంతో, విద్యార్థినులు.. సదరు ప్రిన్సిపాల్ వర్మను గదిలోనే నిర్భంధించారు. అనంతరం, అలిపిరి పోలీసులకు నర్సింగ్ విద్యార్థినులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వర్మను కఠినంగా శిక్షించాలని అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినిలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
అయితే, ఈ ఘటనపై కొందరు విద్యార్థినిలు స్పందిస్తూ.. పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో, అలిపిరి పోలీసులు నిజానిజాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
