
రాష్ట్రంలో సబ్సిడీ వద్దన్న వారి సంఖ్య 2.41 లక్షలు
దేశ వ్యాప్తంగా 1.14 కోట్లు
ఐదేళ్ల గణాంకాలు వెల్లడించిన కేంద్రం
సాక్షి, అమరావతి: దేశంలో గత ఐదేళ్లలో 1.14 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా కేంద్రానికి రూ.31,942 కోట్లు సబ్సిడీ పొదుపు అయినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో 2,41,400 మంది సబ్సిడీని వదులుకున్నారు.
మంత్రిత్వశాఖ తెలిపిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.
⇒ సబ్సిడీల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న పలు చర్యలు ఫలితాలను ఇచ్చాయి.
⇒ ‘గివ్ ఇట్ అప్’ ప్రచారం ద్వారా సంపన్న వినియోగదారులు స్వచ్ఛందంగా తమ సబ్సిడీని వదులుకునేలా ప్రోత్సహించడం జరిగింది.
⇒ బహుళ, నకిలీ వినియోగదారుల ఖాతాలను సమర్థవంతంగా గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
⇒ అధిక ఆదాయం కలిగిన వినియోగదారులకు సబ్సిడీలను నిలిపివేయడంతో పాటు, సబ్సిడీ రీఫిల్ సంఖ్యను పరిమితం చేయడం జరిగింది.
⇒ వినియోగదారులకు బయో మెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణతో పారదర్శకంగా సబ్సిడీ బదలాయింపులు జరుగుతున్నాయి.
⇒ గత ఐదేళ్లలో ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్న రాష్ట్రాల్లో 19.65 లక్షల మందితో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (14.08 లక్షలు), ఢిల్లీ (9.23 లక్షలు), కర్నాటక (7.75 లక్షలు), రాజస్థాన్(7.57 లక్షలు), తమిళనాడు (6.92 లక్షలు), గుజరాత్ (5.46 లక్షలు) ఉన్నాయి.