అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, విజయవాడ : నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా ఏం చేసినా సెన్సేషనే. నిత్యం ప్రజల్లో ఉండే రోజా.. నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కారం చూపుతున్నారు. కొన్ని పనులు స్వయంగా చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. తాజాగా స్టీరింగ్ పట్టి అంబులెన్స్ వాహనాన్ని నడిపారు ఎమ్మెల్యే రోజా. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు జీటీవీ యాజమాన్యం 10 అంబులెన్స్లను అందజేసింది. ఈ అంబులెన్స్లను మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోజా స్వయంగా అంబులెన్స్ను నడిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు వైద్యం అందిస్తున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రయత్నానికి సహాయపడుతూ అంబులెన్స్లు అందించడం సంతోకరం అన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుటున్నారని తెలిపారు.