
54 మందికి స్థాన చలనం
విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి హిమబిందు బదిలీ
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం
ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా జి.భూపాల్రెడ్డి
ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.అనిత
కర్నూలు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా శోభారాణి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ స్థాయిలో జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మందికి స్థాన చలనం కల్పించింది. వీరంతా ఈ నెల 21లోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యధికులను ప్రస్తుతం పని చేస్తున్నచోట మూడేళ్ల కాల పరిమితి పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం, కొందరిని అభ్యర్థన మేరకు హైకోర్టు బదిలీ చేసింది.
⇒ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జి బి.సత్యవెంకట హిమబిందును రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబితను విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి (పీడీజే)గా, అనంతపురం పీడీజే జి.శ్రీనివాస్ను నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా, చిత్తూరు పీడీజే ఎరుగుల భీమారావును అనంతపురం పీడీజేగా పంపారు.
⇒ విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.శ్రీదేవిని ఏలూరు పీడీజేగా నియమించారు. ఆమె స్థానంలో గుంటూరు, పోక్సో కేసుల ప్రత్యేక జడ్జిగా ఉన్న ఎ.అనిత నియమితులయ్యారు.
⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీజేగా ఉన్న అరుణ సారికను చిత్తూరు పీడీజేగా బదిలీ చేశారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న చిన్నంశెట్టి రాజు విశాఖపట్నం పీడీజేగా నియమితులయ్యారు. ఆ స్థానంలో పనిచేసిన ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీ అయ్యారు.
⇒ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న జి.గోపి కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీజేగా బదిలీ అయ్యారు. కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.భూపాల్రెడ్డిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జిగా నియమించారు.
⇒ నెల్లూరు పీడీజే డాక్టర్ సి.యామిని కడప పీడీజేగా, అక్కడ ఉన్న గొల్లా శ్రీదేవి అనంతపురం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులయ్యారు. విజయనగరం పీడీజే బి.సాయికళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు పీడీజేగా బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న కర్నూలు సీబీఐ ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జిగా ఎం.శోభారాణి నియమితులయ్యారు.