
సమావేశంలో మాట్లాడుతున్నమంత్రి నారా లోకేశ్
అచ్యుతాపురంలో మంత్రి లోకేశ్ పర్యటనలో స్థానికుల నిరసన
స్పీకర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుకుడు పల్లాకు అవమానం
బాండ్లు వద్దు.. పరిహారం నగదు రూపంలోనే ఇవ్వాలని నిర్వాసితుల ఆందోళన
నిర్వాసితులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు
సాక్షి, అనకాపల్లి: ‘గత ప్రభుత్వంలో నేను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో.. ఇప్పుడు నాకు కాపలా కాస్తున్న అధికారులే అప్పుడు నా కుర్చిని లాక్కున్నార’ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం ‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు విస్తరణ పనులు, ప్లైఓవర్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధి పనుల శ్రీకారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ఎక్కడా వాటి గురించి మాట్లాడకుండా.. ‘గత ప్రభుత్వంలో నాపై కేసులు పెట్టి వేధించి నన్ను ఇబ్బందులకు గురిచేశారు.. చంద్రబాబును జైలుకు పంపించారు.. హోంమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారం’టూ పాత విషయాలను వల్లెవేశారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ప్రధాని మోదీ ఏపీకి ఇచ్చారని చెప్పారు.
స్పీకర్కు, పల్లాకు అవమానం
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అవమానం జరిగింది. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకూ చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ఈయనకు ప్రాధాన్యత లేకుండా మూలన కుర్చీ వేయడంపై సభకు వచ్చిన వారు విస్మయం వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం లోకేశ్ హైలైట్ కావడమే లక్ష్యంగా నిర్వహించినట్లు పార్టీ సీనియర్లు, కార్యకర్తలు చర్చించుకున్నారు. అలాగే, స్పీకర్ సొంత జిల్లాలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి అయ్యన్న హాజరుకాకపోవడంతో సీనియర్లకు లోకేశ్ పరోక్షంగా చెక్ పెడుతున్నారని అందరూ మాట్లాడుకున్నారు. ఇక ఈ సమావేశంలో కార్యకర్తల నుంచి వినతులు తీసుకోవడానికి లోకేశ్ నిరాకరించారు.
నిర్వాసితుల నిరసన
ఇక మంత్రి లోకేశ్ పర్యటనలో.. తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని రోడ్డు విస్తరణ నిర్వాసితులు నిరసన తెలిపారు. టీడీఆర్ బాండ్ల ప్రతిపాదన విరమించుకోవాలని, తమకు నష్టపరిహారం నగదు రూపంలోనే ఇవ్వాలంటూ అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట జంక్షన్లో ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే.. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి, మంత్రికి నిర్వాసితుల సమస్యలను చెప్పుకునేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నా పోలీసులు వారిని గృహనిర్బంధం, అరెస్టులు చేశారు.