
మహారాణిపేట: రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం విజయనగరం జిల్లా గుర్లలో 87.5 మి.మీ, వైఎస్సార్ కడప జిల్లా శెట్టివారిపల్లిలో 87.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
