
నరసరావుపేట: కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఇబ్బందులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుండటంతో నీరు వృధాగా సముద్రంలో కలిసి ఏపీ రైతులకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.
కృష్ణా జలాలపై ఆధారపడిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు తెలంగాణ వైఖరికి ఆందోళన చెందుతున్నారన్నారు. పల్నాడు ప్రాంతానికి నాగార్జున సాగర్ నీరే శరణ్యమని, దానిపై ఆధారపడి వరి, మిర్చి, పత్తి, పసుపు పంటలు పండిస్తున్నారన్నారు. నీరందకపోతే ఈ రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు.