
భూముల విలువ పెంచినా లక్ష్యాన్ని చేరుకోని వైనం
గతేడాది కంటే రూ.800 కోట్లు తగ్గుదల
2023–24లో ఆదాయం రూ.9,600 కోట్లు
2024–25లో రూ.8,800 కోట్లు రాబట్టడానికే అధికారుల అష్టకష్టాలు
డాక్యుమెంట్ల సంఖ్యా తగ్గుదల
నిరుడు 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్.. ఈ ఏడాది 20.20 లక్షలే
కూటమి వచ్చాక కుదేలైన రియల్ ఎస్టేట్
దాని ఫలితమే ఆదాయం భారీగా తగ్గుదల
పడిపోయిన ప్రజల ఆదాయ మార్గాలు!
భారీగా పెట్టుబడులు, పరిశ్రమల క్యూ అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే ప్రచారమంతా మభ్యపెట్టడానికే!
కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మందగమనంతో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు భూముల విలువలను భారీగా పెంచినా ఫలితం లేకుండా పోయింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నికర ఆదాయం రూ.8,800 కోట్లు మాత్రమే. గత ఏడాది (2023–24) రాబడి రూ.9,600 కోట్లుగా ఉంది.
అంటే, ఈసారి రూ.800 కోట్ల మేర తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు పడిపోయాయి. చంద్రబాబు రాకతో ఉన్న కాస్త రియల్ బూమ్ మరింత పడిపోయిందని రియల్టర్లు వాపోతున్నారు. వారి మాటలు నిజమని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తేల్చింది.
ప్రజల్ని బాదినా పెరగని ఆదాయం
నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.13,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. కానీ, వచ్చింది రూ.8,800 కోట్లు మాత్రమే. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్ నిర్ణయిస్తారు. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.13,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, గత ఏడాది వచ్చినంత కూడా రాకపోవడాన్ని బట్టి సిర్థాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో..
ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో స్థిరాస్తి లావాదేవీలు పెద్దగా జరగడం లేదు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు క్యూ కడుతున్నాయంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే ప్రచారమంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్తిరాస్థి లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. వాళ్లు చెప్పే మాటల్లో కొంతైనా నిజం ఉంటే స్తిరాస్థి లావాదేవీలు పెరగాలి. లేదా కనీసం గతంలో జరిగినట్లయినా జరగాలి. కానీ గతం
కంటే తగ్గిపోయాయి. దీన్నిబట్టి మార్కెట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల చేతుల్లో డబ్బులు లేవని తెలుస్తోంది.
భూముల విలువ పెంపుతోనే..
రూ.8,800 కోట్ల రాబడి అయినా వచ్చిందంటే.. దానికి భూముల విలువ పెంపు కారణంగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువను 40 నుంచి 50 శాతం మేర పెంచారు. దీంతో ఆదాయంలో కొంత తేడా వచ్చింది. ప్రజలపై ఆ భారం కూడా మోపకపోతే రూ.8 వేల కోట్లను కూడా అందుకోలేకపోయేవారమని అధికారులు చెబుతున్నారు.
తగ్గిన 2 లక్షల డాక్యుమెంట్లు
డాక్యుమెంట్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. 2023–24లో 22.5 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అవగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 20.20 లక్షలు మాత్రమే. అంటే 2 లక్షల మేర తగ్గిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా ఉండేది. 2022లో 25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్టర్ అయ్యాయి. చంద్రబాబు హయాంలో రూ.5 వేల కోట్ల లోపున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల దగ్గరకు చేరింది వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు దానిని చేరుకోలేక చంద్రబాబు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.
నేటి నుంచి రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ విధానం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకానుంది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెలగపూడిలోని సచివాలయం నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తర్వాత కాలంలో రాష్ట్రంలోని మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలను విస్తరించనున్నారు.
అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు నిర్ధేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సౌకర్యం కల్పించారు. కాగా ఇప్పటికే విజయవాడలోని గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో అమల్లోకి అమలుచేస్తున్నట్లు మంత్రి కార్యాలయం వివరించింది.