
భర్త, పిల్లలు ఉన్నా మరో యువకుడితో పెళ్లి
కృష్ణలంక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
కృష్ణలంక(విజయవాడతూర్పు)/అనంతపురం: తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ, అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయమయ్యారు. ఒక మంచి యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డిని నమ్మించారు.
కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఆ యువతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్నంగా అతను మధ్యవర్తులకు రూ.2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల ఒకటో తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు.
బస్టాండ్లో టాయిలెట్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కరుణావతి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ‘తన భార్య’ తిరిగి రాకపోవడంతో రాజశేఖరరెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు, ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశారు. ఆ టీమ్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయ‘లేడీ’కి అప్పటికే వివాహం జరిగి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది.