పాత స్నేహితుడిని అరెస్ట్‌ చేయించిన మంత్రి సుభాష్‌ | Labour Minister Vasamsetti Subhash Friend Medisetti Israel Arrest | Sakshi
Sakshi News home page

పాత స్నేహితుడిని అరెస్ట్‌ చేయించిన మంత్రి సుభాష్‌

Jan 14 2025 7:37 AM | Updated on Jan 14 2025 9:52 AM

Labour Minister Vasamsetti Subhash Friend Medisetti Israel Arrest

తన విజయం కోసం కృషి చేసిన చేతులకే

అరదండాలు వేయించిన వైనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వ్యక్తిని ఆ మంత్రి పండగ రోజుల్లో కటకటాలు లెక్కించేలా చేశారు. ఆ వివరాలివీ.. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇశ్రాయేల్‌ గతంలో మంచి స్నేహితుడు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మండపేటలో చంద్రబాబు నిర్వహించిన శ్రీరా..కదలిరా..శ్రీ సభలో సుభాష్‌తో పాటు మేడిశెట్టి ఇశ్రాయేల్‌ కూడా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో సుభాష్‌ రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత దొంగల బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ.. అటు టీడీపీకి, ఇటు శెట్టిబలిజ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఇశ్రాయేల్‌ సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు. 

ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రజలకు వివరించేవారు. శెట్టిబలిజ పెద్దలకు మెదడు మోకాళ్లలో ఉందంటూ.. రామచంద్రపురంలోని శెట్టిబలిజ సామాజిక భవనానికి తొలిసారి వచ్చిన సందర్భంగా మంత్రి సుభాష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కులానికి సుభాష్‌ క్షమాపణ చెప్పాలని ఇశ్రాయేల్‌ డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచి మంత్రి సుభాష్‌ ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఇసుక దొంగతనాలు, సెటిల్‌మెంట్ల వంటి వాటికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తూనే, ఆ పార్టీ అగ్రనాయకులను ఇశ్రాయేల్‌ నేరుగా కలసి ఫిర్యాదులు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నుంచి నేరుగా హెచ్చరికలు రావడంతో తన ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్‌ను మంత్రి దూరం పెట్టాల్సి వచ్చింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సుభాష్‌కు ఇశ్రాయేల్‌ మెయిన్‌ టార్గెట్‌ అయిపోయారు. దీంతో తాళ్లపొలం గ్రామానికి చెందిన భూ వివాదం ఆధారంగా ఇప్పటికే అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి ఎస్సీ, ఎస్టీ కేసు. అలాగే, బైకులు, చిల్లర దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి సినీఫక్కీలో తాళ్లపొలంలో స్కూటర్‌ తగులబెట్టించి, ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్‌, ఆయన కుమారులతో పాటు ఇశ్రాయేల్‌ను ఇరికించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలను వెంటపెట్టుకుని ఇశ్రాయేల్‌, తాళ్లపొలం సర్పంచ్‌లు ఈ నెల 10న అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. 

తమను తప్పుడు కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. శనివారం రామచంద్రపురానికి కొత్త సీఐ బాధ్యతలు చేపట్టారు. శ్రీసీఐ గారు మాట్లాడి పంపించేస్తారశ్రీని చెప్పి ఇశ్రాయేల్‌ను అదే రోజు సాయంత్రం తీసుకుని వెళ్లిన పోలీసులు అతడిపై కొత్త కేసులు నమోదు చేసి అర్ధరాత్రి సబ్‌ జైలుకు తరలించారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలపై తప్పుడు కేసులు మోపి, జైలు పాలు చేస్తున్న అదే వర్గానికి మంత్రి సుభాష్‌ వైఖరిపై ఆ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement