
సాక్షి, వైయస్సార్ జిల్లా: కడప మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డికి మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కావాలనే విధులకు గైర్హాజరయ్యారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో మేయర్ పేర్కొన్నారు.
శుక్రవారం మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అయితే ఆ టైంలో కార్యాలయంలో ఉండి కూడా కమిషనర్ మనోజ్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చించే కీలక మీటింగ్కు డుమ్మా కొట్టడం.. విధులను నిర్వర్తించనందుకుగానూ వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో మేయర్ స్పష్టం చేశారు.
ఆయనతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులకూ శనివారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కమిషనర్ ఆదేశాల మేరకే మిగతా ఉద్యోగులూ హాజరు కాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు.. కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్ కమిషనర్కి మేయర్ సురేష్బాబు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.