
సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం
సాక్షి, అమరావతి: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు. జస్టిస్ దేవానంద్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలో కొలీజియం తీర్మానం చేసింది. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖకు అక్కడి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
జస్టిస్ బట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్లో ఆయన మద్రాసు హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీ హైకోర్టుకు రానున్నారు. ఏపీ హైకోర్టులో ఆయన నంబర్ 4వ స్థానంలో కొనసాగుతారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారు. జస్టిస్ బట్టు దేవానంద్ది కృష్ణా జిల్లా, గుడివాడ. 1966 ఏప్రిల్ 14న బట్టు వెంకటరత్నం, మనోరంజితమ్మలకు జన్మించారు.
కాలేజీలో చదివే సమయంలో ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అటు తరువాత హైకోర్టు న్యాయవాదిగా అయ్యారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య పద్మ కుమారి, కుమార్తెలు మౌని, కీర్తి ఉన్నారు. 2028 ఏప్రిల్ 13 వరకు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.