
‘సాక్షి’పై కేసు ముమ్మాటికీ తప్పుడు కేసే
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై జర్నలిస్టుల మండిపాటు
నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా?
తెలంగాణ, ఏపీ ఎడిషన్లలో వార్త ఒకేలా లేదనడం హాస్యాస్పదం
టీడీపీ వాళ్లు చేసిన హత్యే అని బాధిత కుటుంబసభ్యులే చెబుతుంటే ఇంకేం సాక్ష్యం కావాలి?
ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు
సాక్షి, నెట్వర్క్: ‘ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్పా? నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా? హత్యను హత్య అని చెప్పినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికీ కక్ష సాధింపే. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలి’ అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డీఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. బాపట్లలో నిరసన తెలిపి కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు.

రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ నిరసన చేపట్టారు. మార్కాపురం ప్రెస్క్లబ్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు నెల్లూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెంలో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు.
‘సీమ’ వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులు
సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసు నమోదును నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. అనంతపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, చిలమత్తూరు, పెనుకొండలో నిరసన తెలిపారు.
కర్నూల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఇతర జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గంగాధరనెల్లూరు, తవణంపల్లె, పలమనేరులో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కడపలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
ఉత్తరాంధ్రలో నిరసనలు
విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టులను కేసుల పేరుతో అణిచి వేయాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పార్వతీపురం ఐటీడీఎ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రాలు అందజేశారు.
తప్పుడు కేసు ఎత్తివేయాలి
సాక్షి ఎడిటర్, ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత కోన సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర శాఖ కూడా సాక్షిపై కేసును తీవ్రంగా తప్పుపట్టింది.
సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసు పెట్టడాన్ని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డిలు కేసును తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు ప్రభుత్వ తీరును వేర్వేరు ప్రకటనల్లో తప్పుపట్టారు.