దుర్భిక్ష ప్రాంతంలోని చెరువులకు జలకళ

Jalakala for ponds in drought area under Hundri Neeva Project - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో చెరువులను హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ద్వారా నింపడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు బైపాస్‌ కెనాల్‌ తవ్వకానికి రూ.214.85 కోట్లు మంజూరు చేసింది. సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా మంత్రివర్గం రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించింది. అనంతరం వివిధ అంశాలపై గంటన్నరపాటు చర్చించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ..

► రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌సోర్సింగ్‌ పోస్టులకు ఆమోదం 
► రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటు ఉర్దూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేలా చట్ట సవరణకు అంగీకారం 
► కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం 
► ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ 
► తూనికలు, కొలతల శాఖలో నిబంధనల అమలుకు మెరుగైన చర్యలు. డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టు జాయింట్‌ కంట్రోలర్‌ (అడ్మిన్‌) పోస్టుకు పెంపు 
► రూ.1,234 కోట్లతో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు 
► రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8,741 కోట్ల రుణ సమీకరణకు అంగీకారం. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం 
► బెంగళూరు–కడప, విశాఖపట్నం–కడప మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడపాలన్న ప్రతిపాదనకు అంగీకారం. ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మార్చి 27 నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం. ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందానికి ఆమోదం. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్దతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం 
► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌ – బ్రిడ్జి నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులకు ఆమోదం 
► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్‌ – బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ 
► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అంగీకారం 
► ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంను డిప్యూటీ కలెక్టర్‌గా నియామకానికి ఆమోదం 
► తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం 
► ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌లో కొత్తగా 17 ఆఫీసర్‌ లెవల్‌ (7 ఏఏస్పీ, 10 డీఎస్పీ) పోస్టులకు ఆమోదం 
► ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసన సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం 
► 165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు ఆమోదం 
► నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు అంగీకారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top