
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.
ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది.
