ఆరు నెలల అరాచకం | Illegal cases and arrests against YSRCP leaders in babu govt | Sakshi
Sakshi News home page

ఆరు నెలల అరాచకం

Dec 13 2024 5:26 AM | Updated on Dec 13 2024 9:08 AM

Illegal cases and arrests against YSRCP leaders in babu govt

హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకల్లోలం 

ఆగని అత్యాచారాలతో మహిళా లోకం భీతావహం 

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం 

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు 

ఐఏఎస్, ఐపీఎస్‌లూ రెడ్‌బుక్‌ బాధితులే  

అధికార వ్యవస్థపై కక్షగట్టిన ప్రభుత్వం 

భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం 

రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అజెండాగా మారణహోమం 

ఆరు నెలల్లోనే రాష్ట్రంలో 229 హత్యలు 

750కిపైగా హత్యాయత్నాలు.. 4 వేలకుపైగా దాడులు 

7వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం 

126 అత్యాచారాలు, లైంగిక దాడులు 

వారిలో 12 మందిపై అత్యాచారం.. హత్య 

శాంతిభద్రతలు మృగ్యం.. సామాన్యుడి బతుకు ఛిద్రం 

అధికారిక గూండాగిరీతో బరితెగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 

రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. ఏమిటిదంతా అనుకుంటున్నారా!.. ఆరు నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇది. స్వయంగా చంద్రబాబు, లోకేశ్‌ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్‌ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 

75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. 

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది.

ఇక వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూఅదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సైతం రెడ్‌బుక్‌ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి.

అరాచకాలే బ్రాండ్‌.. అదే బాబు పాలన ట్రెండ్‌ 
చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్‌ ఫొటోలతోసహా రెడ్‌బుక్‌ హోర్డింగులు ఏర్పా­టు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభు­త్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది.

 తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో య­­­థేచ్ఛగా దా­డుల చేయాలని ఆదేశించింది. అందు­కు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్‌ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది.  

పచ్చ మూకల కీచకపర్వం 
ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు 
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సా­గు­తోంది. ఒకప్పటి చంబల్‌ లో­య­లోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడట­మే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు.

6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం ప­డు­తోంది. వారిలో 12 మందిపై అత్యాచా­రం జరిపి హత్య చేయడం రౌడీ మూ­కల బరితెగింపునకు నిదర్శనం. ఇ­వ­న్నీ అధికారికంగా కేసులు నమో­దైన ఘటనలే. కూటమి పెద్ద­లు, గూండా­లకు భయపడి బాధితులు ఫిర్యాదు­లు చేయని ఉదంతాలు అంత­కు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 
 
229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు 
చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తి­స్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హ­త్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డా­రు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి.  

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత  
సోషల్‌ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. 

ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కా­రు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్‌ చేసింది.
 


రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి పోలీస్‌ దాసోహం 
పోలీస్‌ శాఖ లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్‌ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్‌ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. 

అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్‌ అధికారులు పీఏఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్‌ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్‌ చేసింది.  

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర 
వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.

 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మె­ల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యే­లు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మె­ల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి తదితరులతోపాటు వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమో­దు చేసి వేధిస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతు­న్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement