సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉ.8.30 నుంచి సా.5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లిలో 3.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా పరవాడలో 1.7, కాకినాడ జిల్లా శంఖవరంలో 1.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇక గురువారం ఉ.8.30 నుంచి శుక్రవారం ఉ.8.30 వరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 8.6 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా రేగిడి మండలం ఆమదాలవలసలో 8.2, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 7.3, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 6.8, లక్ష్మీనరసుపేట 6.7, కోవిలం 6.6, పార్వతీపురం మన్యం జిల్లా గోయిడిలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండడంతో శనివారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


