‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుని నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్
డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా?
కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా?
జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు.
డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు.
ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?
» డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?
» అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?
» నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా?


