
వరదలు సమాచారం ఉన్నా కానీ చంద్రబాబు సర్కార్ అలర్ట్ చేయకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది.
సాక్షి, విజయవాడ: వరదలు సమాచారం ఉన్నా కానీ చంద్రబాబు సర్కార్ అలర్ట్ చేయకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 45 మంది మరణించినట్టు కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్క విజయవాడ నగరం, రూరర్లోనే 25 మంది మృతి చెందగా, ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. 8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం(31వ తేదీ) రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.
సంబంధింత వార్త: వరదను మించిన విపత్తు బాబే!
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వేలాదిమంది బాధితులు ఆకలి కేకలు పెడుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది నాలుగైదు రోజులుగా కనీసం అన్నం కూడా కడుపునిండా తినకుండా వరదల్లో కొట్టుమిట్టాడిన దయనీయ దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి.