టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే..

Gudivada Amarnath Slam On TDP Over Geetam Occupied Lands - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి భూమి స్వాధీనం చెసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గోగ్గులు పెడుటున్నారని దుయ్యబట్టారు.

రూ.800 కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో కేసుల్లో లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని మండ్డిపడ్డారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడ్డవారే అని, ఈఎస్‌ఐ స్కామ్‌లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిందని దుయ్యబట్టారు. భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్నారు.

ఆక్రమించిన భూమికి నోటీసీలు ఇవ్వకుండా, వందల కోట్ల విలువ చేసే భూమి అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా అని నిలదీశారు. ప్రభుత్వం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై కక్ష సాధింపుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విశాఖలో ఆక్రమణకు గురైన విలువైన భూములు కాపాడుతామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయంలో వేసిన సిట్ వాస్తవాలు బైటకు రాలేదని, గజం భూమి కూడా సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో కబ్జాకు గురికాదని  అన్నారు. చదవండి: గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు

గీతం యూనివర్సిటీలో గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో విశాఖ ప్రజల్లో సంతోషం ఉందని తెలిపారు. గీతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో  ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున విశాఖలో భూములను మింగేశారని అన్నారు. మాజీ మేయర్ సబ్బంహరితో పాటు పలువురు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారని మండిపడ్డారు.  యూనివర్సిటీ యాజమాన్యం గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినప్పటికీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయం అన్నారు. ఆక్రమణలు తొలగిస్తే రాజకీయం చేయడం తగదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top