
శ్రీశైలం ప్రాజెక్టు రక్షణ గాలికి.. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫార్సులు బుట్టదాఖలు
ఎప్రాన్కు దిగువన ధ్వంసమైన కాంక్రీట్ సిలిండర్ల పునరుద్ధరణ చేపట్టని ప్రభుత్వం
వరద వచ్చేలోగా గ్యాలరీల్లో లీకేజీల అడ్డుకట్టకు గ్రౌటింగ్ చేయాలన్న సూచనా పెడచెవినే..
వర్షాలు ముంచుకొస్తున్న వేళ స్పిల్వే దిగువన రోడ్డు, కుడి గట్టు, కొండవాలు షార్ట్ క్రీటింగ్ పనులకు రూ.31.40 కోట్లతో అనుమతి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని సాగు నీటిరంగ నిపుణులు, అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్పూల్(భారీ గొయ్యి) స్పిల్ వైపు విస్తరించకుండా ఏప్రాన్కు చివరన వేసిన కాంక్రీట్ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి.
వరద వచ్చేలోగా వాటిని పునరుద్ధరించాలని ఎన్డీఎస్ఏ పదేపదే సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలకు అడ్డుకట్టవేయడానికి గ్రౌటింగ్ చేయాలన్న సూచననూ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రాజెక్టుకు శాశ్వత భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది.
ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం
ప్రాజెక్టు భద్రతపై ఈ ఏడాదిమార్చి 6న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గత నెల 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనిల్ జైన్ తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు.
వరద వచ్చేలోగా ఏప్రాన్కు చివరన ధ్వంసమైన కాంక్రీట్ సిలిండర్లను పునరుద్ధరించాలని.. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలను అడ్డకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని ఆదేశించారు. ప్లంజ్ పూల్ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు.
వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్ సీఈని ఆదేశించడం గమనార్హం.
2009 వరదకు భారీ నష్టం
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తయింది. 1975–76లో ప్రాజెక్టు స్పిల్ వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే(బకెట్) ప్రాంతం కోతకు గురై భారీ గుంత(ప్లంజ్ పూల్) ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984–85లో ఎప్రాన్కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాప్ వేశారు.
అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కానీ.. 2009, అక్టోబర్ 2న ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీరట్లకు పెరిగిపోవడంతో స్పిల్ వే గేట్లపైన వరద ప్రవాహం ప్రవహించింది.
ఈ బీకర వరద 78 గంటలపాటు పోటెత్తడంతో ప్లంజ్ పూల్ మరింత పెద్దగా మారింది. ప్రాజెక్టు స్పిల్వే దిగువన ఏప్రాన్ నుంచి 50 మీటర్ల నుంచి 220 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో ప్లంజ్ పూల్ విస్తరించింది. ఈ భారీ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది దిగువకు విస్తరిస్తోందేమోనని ఎన్డీఎస్ఏ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.